రాయగడ: ఆంధ్రాలో కోవిడ్ కేసులు నమోదవుతుండడం, బరంపురంలో ఓ వ్యక్తి చికిత్స పొందుతున్నట్లు సమాచారం రావడంతో రాయగడలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే ప్రస్తుతం జిల్లాలో కరోనా వ్యాప్తిపై ఎలాంటి ఆందోళనకర పరిస్థితి లేదని, ప్రజలు పుకార్లను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సూచించాయి. ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు మీదుగా ప్రతీరోజు వందలాది మంది రాకపోకలు సాగిస్తుండడంతో సరిహద్దు ప్రాంతాల్లో పర్యవేక్షణ, ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. వ్యాపారం, వైద్యం ఇతర అవసరాల కోసం రాయగడ ప్రాంత ప్రజల్లో చాలా మంది ఆంధ్రప్రదేశ్పై ఆధారపడుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తత అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఇక వర్షాకాలం ప్రభావంతో రాయగడ జిల్లా ప్రధాన అసుపత్రిలో సాధారణ జ్వరం, జలుబు, దగ్గువంటి సీజనల్ రోగాల సంఖ్య పెరగడంతో ఔట్పేషెండ్ విభాగం, రక్త పరీక్ష కేంద్రాల్లో రద్దీ కనిపిస్తోంది. అయితే ఇది సాధారణమేనని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రత్యేక పడకలు, ఆక్సిజన్ సౌకర్యం, వెంటిలేటర్లు, అవసరమైన వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వారికి వైద్యుల సూచన మేరకు అవసరమైన పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించారు. జ్వరం, జలుబు ,దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వెంటనే సమీప ఆరోగ్య కేంద్రం లేదా వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య శాఖ సూచించింది.


