పర్లాకిమిడి: రథయాత్ర సందర్భంగా స్థానిక జగన్నాథ మందిరం దేవస్నాన వేదికపై గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు ఉత్సవానికి ఏడీఎం మునీంద్ర హానగ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దయామయ పాడీ, తబాలా కళాకారులు రఘునాథ పాత్రో, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్ తదితరులు హాజరయ్యారు. పట్టణంలో స్థానిక కళాకారులుతో పలు భక్తి పాటలకు నృత్యం ప్రదర్శించి పలువురిని అలరించారు. ఈ నృత్యాలలో ఉత్కళ బాలాశ్రమం, గ్రేస్ డ్యాన్సు అకడమీ, బారునర్తన్, వందేమాతరం డ్యాన్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. కళాకారులకు అధికారులు ప్రశంసాపత్రాలను అందజేశారు.
చిన్నమొత్తాల పొదుపుపై అవగాహన
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మా బ్లాక్ కె.సి.పూర్ ప్రభుత్వ ఎస్.ఎస్.డి ఉన్నత విద్యాలయంలో చిన్న మొత్తాలు పొదుపుశాఖ ఆధ్వర్వంలో స్మాల్, పెద్ద మొత్తాల పొదుపు పథకాలపై మంగళవారం కర్మశాల జరిగింది. ఈ కర్మశాలకు జిల్లా ఆర్థికశాఖ, చిన్నమొత్తాలు పొదుపు శాఖ అధికారి త్రివేణికుమారి దేవి, డీడబ్ల్యూఓ సల్మాన్ రైకా, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ సరితా బెహురియా, గుమ్మా సబ్ పోస్టుమాస్టర్ శంకరపాత్రో, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్న మొత్తాలు పొదుపు చేయడం ద్వారా భవిష్యత్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని అధికారులు వివరించారు. విభిన్న పొదుపు పథకాలను ప్రభుత్వం లాటరీ ద్వారా ప్రోత్సాహకాలు లభిస్తున్నాయని త్రివేణి కుమారీ దేవి తెలియజేశారు.
వృద్ధురాలికి మాజీ సైనికులు చేయూత
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని జిల్లా పరిషత్ దగ్గర కంపోస్ట్ కాలనీ ద్వారకా నగర్లో నివాసముంటున్న వృద్ధురాలు సూరాలమ్మకు మాజీ సైనికులు చేయూతనందించారు. ఆమె కోసం ఒక ఇంటిని నియమించి డీఎస్పీ సీహెచ్ వివేకానంద చేతులమీదుగా మంగళవారం ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకు చెందిన మాజీ సైనికుడు కాకర్ల నర్సింగ్ వృద్ధురాలి ఇబ్బందులు తెలుసుకొని చలించిపోయాడు. దీంతో అతని మన సిక్కోలు సైనికుడు ఇన్స్ట్రాగామ్ అకౌంట్ ద్వారా సాయం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు మాజీ సైనికులు, దాతలు విరాళాలు అందించారు. ఈవిధంగా సేకరించిన విరాళాలతో వృద్ధురాలికి ఒక తాత్కాలిక గృహం నిర్మించి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ చైర్మన్, విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు, లయన్ నటుకుల మోహన్, పైడి మురళీధరరావు, సనపల రామకృష్ణ, ఎం.సింహాచలం, పైడి రామారావు, పి.చిన్నరావు, పి.వెంకటేశ్వరరావు, టి.శ్రీను, బి.శంకరరావు, దుర్గా భవానీ వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కింతాడ సంతోష్ పాల్గొన్నారు.
సరుబుజ్జిలి: సరుబుజ్జిలి జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నందికొండ కాలనీకి చెందిన ఫైర్స్టేషన్ ఏఎస్ఐ గుజ్జల అప్పలరాజు మంగళవారం తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలరాజు ఎప్పటిలాగే ఆమదాలవలస ఫైర్స్టేషన్లో విధులు ముగించుకొని తన ఇంటికి మంగళవారం వెళ్తున్నారు. అదే సమయంలో శ్రీకాకుళం నుంచి కొత్తూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సరుబుజ్జిలి జంక్షన్లో ఢీకొంది. ఈ ప్రమాదంలో అప్పలస్వామికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


