రాయగడ: ప్రపంచ హెపటైటీస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పితామహాల్లోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం క్యాంపస్ నర్సింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. హెపటైటీస్ మహామ్మారి గురించి తెలుసుకుందాం అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా వైరల్ హెపటైటీస్ వ్యాధి, వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, ముందస్తు నిర్ధారణ, టీకాలు, చికిత్స విధానాలపై రోగులు, వారి సహాయకులకు అవగాహన కల్పించారు. అధ్యాపకుల పర్యవేక్షణలో మూడో సెమిస్టర్ నర్సింగ్ విద్యార్థులు హెపటైటీస్ ఎ, బి, సి, డి, ఇ రకాలు, వాటి లక్షణాలు, కారణాలు, కాలేయ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వంటి సమస్యలను వివరించారు. హెపటైటీస్–బీ టీకా ప్రాముఖ్యత, సురక్షిత ఇంజక్షన్లు, రక్తమార్పిడి, చేతుల పరిశుభ్రత, పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు వినియోగం, సూదులు, లేదా వ్యక్తిగ వస్తువులను ఇతరులతో పంచుకోకూడదనే విషయాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ మేరకు ఫ్లకార్డులతో చైతన్యం కలిగించారు.


