కొత్తూరు: స్థానిక పీఏసీఎస్ వద్ద ఎరువులు కోసం రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఏపీసీఎస్కు 400 బస్తాల డీఏపీని వ్యవసాయ శాఖ కేటాయించింది. కేటాయించిన డీఏపీని మంగళవారం పీఏసీఎస్ సిబ్బంది రైతులకు యాప్ ద్వారా విక్రయించారు. ముందుగా డీఏపీ కొనుగోలు కోసం వచ్చిన రైతులకు వరుస క్రమంలో టోకెన్లు ఇచ్చారు. అయితే కొంతమంది మంది రైతులకు సాయంత్రం వరకు ఉన్నా ఎరువులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దీంతో రైతులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ ఆందోళన చేపట్టి సొసైటీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎరువుల విక్రయంపై సొసైటీ అధికారి నాగరాజు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ప్రసాద్ అన్నారు. విక్రయాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 300 బస్తాలకు టోకెన్లను రైతులకు ఇచ్చారని, అయితే టోకెన్లు ఇచ్చిన రైతులకు ఎరువులు ఇవ్వకుండా స్టాక్ అయిపోయిందని చెప్పడం సరికాదన్నారు. అలాంటప్పుడు టోకెన్లు ఎందుకిచ్చారని రైతులు ప్రశ్నిస్తే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎదురుచూసినా డీఏపీ ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ అధికారులు ఇష్టానుసారంగా ఎరువులు విక్రయించారన్నారు. లైన్లో ఉన్నవారికి ఎరువులు ఇవ్వకుండా నచ్చినవారికి ఎరువులు అమ్మకాలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కొత్తూరు, కర్లెమ్మతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు


