భువనేశ్వర్: బొలంగీర్ జిల్లాలోని టిట్లాగఢ్ సమీపంలో బొగ్గు రవాణా చేస్తున్న గూడ్స్ రైలు సోమవారం ఉదయం వ్యాగన్ పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. బొలంగీర్ నుంచి టిట్లాగఢ్ వైపు గూడ్స్ రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తూర్పు కోస్తా రైల్వే సంబల్ పూర్ మండలంలో గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పింది. బొగ్గు రవాణా చేస్తుండగా సికిర్, టిట్లాగఢ్ స్టేషన్ల మధ్య సోమవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇంజిన్ నుంచి 14వ వ్యాగన్ వెనుక ట్రాలీ చక్రం పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. సమాచారం అందడంతో రైల్వే శాఖ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కంటాబంజి నుంచి ప్రమాద సహాయక రైలు సంఘటన స్థలానికి చేరి సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాలు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించింది.


