భువనేశ్వర్: ఉత్కళీయ సంప్రదాయం జగన్నాథ సంస్కృతితో ముడి పడి ఉంది. ఈ సంప్రదాయంలో వదిన–మరుదులు, బావ–మరదలు ముఖాముఖి పడకుండా మెలకువతో కుటుంబంలో మెసలడం ఆచారం. కుటుంబ, సమాజ వ్యవస్థని క్రమశిక్షణతో కొనసాగించేందుకు ఈ ఆచారం దోహదపడుతుంది. బహుడా యాత్ర సందర్భంగా ఈ ఆచారం వాస్తవ కార్యాచరణ ప్రతిబింబిస్తుంది. శ్రీ జగన్నాథ మహాప్రభువు శ్రీమందిరానికి తిరిగి చేరుకునే వేళ ముందుగా బలభద్రుని తాళధ్వజ రథం, అనంతరం సుభద్రాదేవి దర్పదళన రథం సింహ ద్వారం సమీపానికి చేరుకుంటాయి. ఆ తర్వాత గజపతి మహారాజు శ్రీనహర్ వద్ద మహా ప్రభువు నందిఘోష రథాన్ని నిలిపివేస్తారు. అనంతరం శ్రీమందిరం నుంచి మహాలక్ష్మి దేవిని తీసుకొచ్చి లక్ష్మి జగన్నాథుల దివ్య భేటీ జరిపిస్తారు.మహాలక్ష్మీ దేవి సింహ ద్వారం నుంచి వెలుపలకు వచ్చి తిరిగి వెళ్లే సమయంలో బలభద్రుని రథంపై సేవాయతులు తెర వేస్తారు. దీని వల్ల మహాలక్ష్మి దేవి బావ బలభద్రుడు చూడకుండా కుటుంబ కట్టుబాటుల ప్రకారం తిరిగి శ్రీ మందిరానికి చేరుతుంది. ఇదే జగన్నాథ సంస్కృతిలో సీ్త్ర పట్ల గౌరవానికి, కుటుంబ సంబంధాల మర్యాద పరిమితులకు ప్రతీక. ఈ పవిత్రమైన సంస్కారాన్ని స్వయంగా భగవంతుడే ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవడం మానవీయ లీలల్లో ఒకటి.


