ఐటీఐ ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఐటీఐ ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

ఎచ్చెర్ల : ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మిగులు సీట్ల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్‌ విడుదలైందని ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌, ప్రవేశాల జిల్లా కన్వీనర్‌ ఎల్‌.సుధాకరరావు గురువారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ‘ఐటిఐఅడ్మిషన్స్‌.ఏపీ.జివోవి.ఇన్‌’లో ఆగస్టు 3లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకుని సమీప ప్రభుత్వ ఐటీఐలో ధ్రువపత్రాలను వెరిఫికేషన్‌ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఆగస్టు 6న, ప్రైవేటు కళాశాలల్లో ఆగస్టు 8న కౌన్సెలింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు.

ట్రిపుల్‌ ఐటీలో మూడో విడత కౌన్సెలింగ్‌

ఎచ్చెర్ల : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం క్యాంపస్‌ పరిధిలో 2026–27 సంవత్సరానికి మూడో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ గురువారంతో ముగిసింది. సెమినార్‌ హాల్‌లో నిర్వహించిన ఈ ప్రక్రియలో 174 మందికి గాను 106 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇంకా 68 మిగులు సీట్లు ఉన్నాయి. కార్యక్రమంలో క్యాంపస్‌ డైరెక్టర్‌ గిరిధర్‌ మద్రాసు, రిజిస్ట్రార్‌ సండ్ర అమరేంద్రకుమార్‌, పరిపాలనాధికారి శివరామకృష్ణ, ఫైనాన్స్‌ అధికారి వాసు, డీన్‌ శివరామశాస్త్రి, ప్రకాశరావు, యోగీశ్వరి, కో–ఆర్డినేటర్లు, విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌లో మెరిట్‌ జాబితా

శ్రీకాకుళం: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచింగ్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తాత్కాలిక మెరిట్‌ జాబితాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాలరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రిన్సిపాల్‌, సిఆర్‌టీ, పీజీటీ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

సాహస అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

శ్రీకాకుళం న్యూకాలనీ: భారత ప్రభుత్వ యువజన వ్యవహరాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా నార్గే జాతీయ సాహస అవార్డు(టీఎన్‌ఎన్‌ఏఏ)–2025 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్‌శ్రీ సీఈఓ వి.వి.అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 2023, 2024, 2025 సంవత్సరాల్లో భూమి, ఆకాశం, నీరు/సముద్రం, గాలిలో విశేష సాహస కార్యక్రమాలు చేసినవారు, జీవితకాలంలో విశిష్ట విజయాలు సాధించినవారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై నవారికి నార్గే కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం, బ్లేజర్‌, రూ.15లక్షల నగదు బహుమతి అందుతుందన్నారు. అవార్డ్స్‌.జీవోవి.ఇన్‌ వెబ్‌పోర్టల్‌లో ఆగస్ట్‌లో 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు సెట్‌శ్రీ శ్రీకాకుళం జిల్లా కార్యాలయం మేనేజర్‌ కె.వి.రమణ (7989862755)ను సంప్రదించాలని కోరారు.

గుర్తు తెలియని వృద్ధురాలి మృతి

నరసన్నపేట: స్థానిక సత్యవరం కూడలిలో బస్‌షెల్టర్‌ వద్ద గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. వెంటనే నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈమె ఇదే ప్రాంతంలో యాచన చేస్తుండేదని స్థానికులు చెబుతున్నారు.

పద్మనాభ గిరిపై వరద పాయసం

జలుమూరు: వానలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ అర్చకులు అనంత పద్మనాభ గిరిపై ప్రత్యేక పూజలు నిర్వహించి వరద పాయం పోశారు. గురువారం శ్రీముఖలింగం ఆలయం పరిధి కరకవలస సమీపంలోని అనంత పద్మనాభ గిరిపై శ్రీముఖలింగం, కరకవలస అర్చకులు, రైతులు కలిసి విష్ణుమూర్తికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు సింహాచలం మాట్లాడుతూ సంప్రదాయ ప్రకారం పద్మనాభ గిరిపై వరద పాయసం పోస్తే వర్షాలు పడతాయని చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు శివ, శ్రీకృష్ణ, అచ్యుతరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు.

వృద్ధురాలి మృతదేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement