మల్కన్గిరి: మల్కన్గిరి సమితి పరిధిలోని ఎంవీ 7 గ్రామంలో మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో రహదారిపైకి వచ్చిన పది అడుగుల కొండచిలువ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పామును స్థానికులు స్నేక్ హైల్ప్లైన్ బృందానికి సమాచారం ఇచ్చారు. దీంతో శరత్కుమార్ మాఝి, తపన్ కుమాన్ శేఠిమరియు రమేష్ పూజరిల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని గంట సేపు శ్రమించి కొండచిలువును పట్టుకున్నారు. దీని పొడవు పది అడుగులు ఉన్నట్టు తెలిపారు. బుధవారం పామును వైద్యపరీక్షలు నిర్వహించగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తుంటాయన్నారు. సమీప అడవిలో విడిచి పెడతామన్నారు.
తుపాకీ స్వాధీనం
● ఒకరు అరెస్టు
మల్కన్గిరి: మల్కన్గిరి సమితి గౌడిగూడ పంచాయతీ నీలిమారి గ్రామంలో తుపాకీతోపాటు తుపాకీని తయారీ చేసే సామగ్రిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకొని ఒకరుని అరెస్టు చేశారు. టాటా పవర్ సంస్థకు చెందిన కాంట్రక్ట్ ఉద్యోగి దీపక్ విశ్వాస్ నెలవారీ బిల్ కోసం అనుకూల్ నాయక్ ఇంటికి వెళ్లారు. అనుకూల్ నాయక్కు గతంలో సుమారు రూ.17 వేల విద్యుత్ బిల్లు బకాయి ఉంది. గత నెల రూ. 219 బిల్లు వచ్చింది. బిల్లు వసూలు చేసే సమయంలో దీపక్పై అనుకూల్ నాయక్ ముందుగా కత్తితో దాడి చేశాడు. అనంతరం తుపాకీని చూపించి చంపేస్తానని బెదిరించాడు. అక్కడ ఉన్న గ్రామస్తుల సాయంతో దీపక్ తప్పించుకున్నాడు. ఈ విషయం మల్కన్గిరి ఆదర్శ పోలీస్ స్టేషన్లో దీపక్ ఫిర్యాదు చేశాడు. అనుకూల్ నాయక్ను అరెస్టు చేసి, అతని ఇంటిని పోలీసులు సోదా చేశారు. తుపాకీతోపాటు తుపాకీల తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం నిందితుడిని కోర్టుకు తరలిస్తామని ఐఐసీ రీగాన్ కీండో తెలిపారు.
రచయిత నాగేశ్వరరావు రెడ్డి కన్నుమూత
జయపురం: జయపురం ప్రజలకు చిరపరిచితుడు, మంచి గాయకుడు, చిత్రకారుడు, కళాకారుడు, తెలుగు భాషాభిమాని, రచయిత కె.నాగేశ్వరరెడ్డి అనారోగ్యంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పట్టణ ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయాయు. జయపురంలో జరిగే తెలుగు సంఘాలు, తెలుగు సాంస్కృతిక సమితి నిర్వహించే ప్రతిఉత్సవంలోను నాగేశ్వరరెడ్డి పాడే పాటలు శ్రోతలను ఉర్రూత లూగించేవి. జయపురం తెలుగు సాంస్కృతిక సమితిలో క్రియాశీలక సభ్యులుగా ఉండి తెలుగు భాషాప్రగతికి సేవలు అందించారు. నాగేశ్వరరెడ్డి మృతి జయపురం తెలుగు వారికి తీర్చలేనిలోటని జయపురం తెలుగు సాంస్కృతిక సమితి మాజీ అధ్యక్షులు, జయపురం రెడ్డి సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వి.భాస్కరరెడ్డి, ప్రస్తుత అధ్యక్షులు కె.దిలీప్ రెడ్డి, సంఘ సభ్యులు వాఖ్యానిస్తూ నివాళులర్పించారు. పట్టణానికి చెందిన పలువురు కళాకారులు, మిత్రులు నాగేశ్వరరెడ్డి మృతికి సంతాపం తెలియజేశారు.
కాంగ్రెస్ నిరసన
పర్లాకిమిడి: నీట్ పరీక్షపత్రం లీక్ ఘటనలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై లాఠీ చార్జిచేసి, ఏఐసీసీ సభ్యులు, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని అరెస్టు చేసినందుకు నిరసనగా పర్లాకిమిడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట పీఎం మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు పాపారావు, అభిమన్యు పండా, పట్టణ కాంగ్రెస్ నాయకులు సూర్యనారాయణ పాత్రో, ఉపాధ్యక్షుడు బర్నాల జనార్దన రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.


