రాయగడ: అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా సేకరించిన విరాళాల నిధుల వినియోగంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని రాయగడ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు అప్పల స్వామి కడ్రక ఆరోపించారు. మంగళవారం స్థానిక సర్క్యూట్ హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సంబంధించిన నిధుల్లో సుమారు రూ.1,400 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ట్రస్టుకు చెందిన కొందరు కీలక వ్యక్తుల పాత్రపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజల మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకున్నారని, అదే సమయంలో ఆలయ నిధుల దుర్వినియోగం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో నిజాలు ప్రజలకు వెల్లడించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్కు చెందిన పలువురు సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


