క్యాచ్ ది రైన్తో జల సంరక్షణపై
అవగాహన
రాయగడ: భవిష్యత్ తరాలకు మంచినీటి కొరత లేకుండా చూడాలంటే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందనే సందేశంతో రాయగడ మున్సిపాలిటీ క్యాచ్ ది రైన్ అవగాహన కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల పరిరక్షణపై పట్టణ ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తోంది. కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ ప్రాధాన్యాన్ని తెలియజేస్తు హోర్డింగ్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో సమాచార స్టాండీలను ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న ఎల్ఈడీ డిస్ప్లే స్క్రీన్ల ద్వారా కూడా క్యాచ్ ది రైన్ సందేశాన్ని నిరంతరం ప్రసారం చేస్తున్నారు. వర్షపు నీటిని ఎలా సేకరించాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, భాగర్భ జలాల పెంపులో దాని పాత్ర ఎంత ముఖ్యమో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రతీ వర్షపు నీటి బొట్టు అమూల్యమైన సహజ సంపద అని పేర్కొన్నారు. ప్రతీ ఇంటిలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో, వ్యాపార సముదాయాల్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలాల మట్టాన్ని పెంచవచ్చని వివరించారు. అలాగే నీటి కొరతను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఎంతో దోహదపడుతోందని పేర్కొన్నారు. ప్రతీ పౌరుడు ఈ కార్యక్రమంలొ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ మాట్లాడుతూ.. వర్షపు నీటిని సంరక్షించండి–భావితరాల కోసం నీటిని ఆదా చేయండి అనే సందేశాన్ని ప్రతీ ఒక్కరూ ఆచరణలో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వర్షపు నీటి సంరక్షణను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజలందరూ కలిసి చేపట్టే జలనాందోళనగా మార్చాలని అన్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న నీటి కొరత దృష్ట్యా వర్షపు నీటి సంరక్షణ అత్యంత అవసరమన్నారు. ఈ నేపథ్యంలో రాయగడ మున్సిపాలిటీ చేపట్టిన క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని అందరికి తెలిసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.


