రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి
భాస్కరరావు
స్థానిక పోరుకు ..
రాయగడ:
రానున్న పంచాయతీ ఎన్నికల్లో బిజు స్వాభిమాన్ మంచ్ కీలక పాత్ర పొషిస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు, రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని కొలనరలో మొదటి సారిగా ఆ సంస్థ తరఫున భారీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలతో మమేకమై తన సేవలను అందించానని అన్నారు. బీజేడీకి గుడ్బై చెప్పి బిజూ స్వాభిమాన్ మంచ్ (బీఎస్ఎం) పేరిట సామాజిక సేవా సంస్థను తొమ్మిది నెలల క్రితం ఏర్పాటు చేసినట్టు వివరించారు. అయితే సంస్థ ఏర్పాటై తొమ్మిది నెలల పూర్తయినప్పటికీ ఎటువంటి కార్యకలాపాలను నిర్వహించలేదని అన్నారు. తనను నమ్ముకొని ఉన్న అభిమానులకు, మద్దతు దారులకు, ప్రజలకు తాను అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఆవిర్భవించిన ఈ సంస్థ రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందని ప్రకటించారు. ప్రజల ఆదరాభిమానాలతో సంస్త తరఫున అభ్యర్తులను ఎన్నికల బరిలొ దింపేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. త్వరలో ప్రతీ పంచాయతీలో ఇటువంటి తరహా కార్యక్రమాలను బీఎస్ఎం ద్వారా నిర్వహించనున్నామని అన్నారు. ప్రజా సేవ చేసేందుకు అభిష్టం ఉన్న వారు తమ వెంట ఉన్నారని వారి అభీష్టం మేరకు ఎన్నికల్లో పొటీ చేసేందుకు వారికి అండగా నిలుస్తానని అన్నారు. ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా బీఎస్ఎం సంస్థ పనిచేయదని.. ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక మాట్లాడుతూ.. ప్రజల ఆదరణ ఉన్నంత వరకు తామంతా కలిసి పోరాడుతామని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అండదండలతో బిజుస్వాభిమాన్ మంచ్ ఏర్పాటవ్వలేదన్నారు. నెక్కంటి భాస్కరరావు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేశారని వివరించారు. తామెప్పుడూ నెక్కంటి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బిజూ స్వాభిమాన్ మంచ్ ఉనికిని చాటుకుంటామఅన్నారు. ప్రజల ఆదరణ ఉంటే ఏ పార్టీ అండదండలు అవసరం లేదని హిమిరిక అన్నారు. ప్రజలే సైనికులుగా నెక్కంటికి వెన్నెంట ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా రాయగడ సమితి వైస్చైర్మన్ హర ప్రసాద్ హెప్రుక ఆదివాసీ భాషలో ప్రసంగించారు. అంతకు ముందు కొలనారలొ భారీ ర్యాలీ నిర్వహించగా.. నెక్కంటితో పాటు అతని అనుచరులు, మద్దతుదారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


