జయపురం: కొరాపుట్ జిల్లాకు అతి త్వరలో 50 కొత్త ఈవీ (ఎలక్ట్రికల్ వెహికల్) బస్సులు రానున్నాయి. సుస్థిరమైన, కాలుష్య రహిత ప్రజా రవాణా సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పిఎంఈ–డ్రైవ్ పథకంలో కొరాపుట్ జిల్లాకు 50 కొత్త ఈవీ బస్సులు ప్రవేశ పెట్టనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఈవీ బస్సులు 200 కిలోమీటర్ల పరిధిలో నడుస్తాయి. జయపురం నుంచి కొరాపుట్ జిల్లాలో వివిధ ప్రాంతాలను కలుపుతూ ఈ బస్సులు నడుస్తాయి. ఈ పథకంలో 6 నెలలలో ఈవీ బస్సులు రోడ్లపైకి రానున్నాయని వెల్లడించారు. ఈ బస్సులు పయనించే మార్గంలో ప్రత్యేక చార్జింగ్ స్టేషన్లు, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్లు, ప్రత్యేక ట్రాన్స్ పార్మర్లు మొదలగు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో బస్సు సౌకర్యాలు లేని 6 మారుమూల పంచాయతీల్లో ముఖ్యమంత్రి బస్సు సేవా పథకంలో ఈ బస్సులు నడుపుతారు. రెండు నెలల్లో జయపురంలో ఆటోమెటిక్ వాషింగ్ ప్లాంట్ నిర్మించనున్నారు. మురుగు నీటిని సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ది చేసి బస్సులను కడిగేందుకు రీ సైక్లింగ్ చేస్తారు. కొత్తగా రానున్న 50 ఈవీ బస్సులు ఉంచే స్థలం కొరకు ఓఎస్ఆర్టీసీ డిపోలో ఉన్న 24 పాత బస్సులను ఒక నెలలోగా స్క్రాప్గా వేలం వేయనున్నారు. ఈ పథకం సజావుగా అమలు చేసేందుకు రాష్ట్ర రవాణా శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ మిశ్ర, కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్లు నిర్మాణంలో ఉన్న అటల్ బస్టాండ్లను తనిఖీ చేశారు. జయపురం నుంచి కొత్త వోల్వో బస్సు సర్వీస్ లను నడిపే ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉంది. ప్రభుత్వం ఆమోదిస్తే శబరిశ్రీక్షేత్రం కొరాపుట్ నుంచి కామాఖ్య పీఠం వరకు, అలాగనే ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రధాన ప్రాంతాలకు రూట్లు కలుపుతారు.


