పర్లాకిమిడి: పూరీ తర్వాత అత్యంత ఆడంబరంగా జరిగే రథయాత్ర కోసం స్థానిక యూనియన్ బ్యాంకు స్వయం ఉపాధి శిక్షణ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం రథయాత్ర కమిటీ సభ్యులు, ప్రెస్తో ఒక సన్నాహాక సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి అతిథులుగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి దయామయ పాడి, తహసీల్దార్ బెహరా, సీనియర్ సిటిజన్ పూర్ణచంద్ర మహపాత్రో, తదితరులు హాజరయ్యారు. జూలై 16న రథయాత్రకు యాత్రికుల భద్రత, సీసీ కెమెరాలు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలపై సబ్కలెక్టర్ అనుప్ పండా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ప్రతి రోజు గుండిచా మందిరం వద్ద విక్రయించే ప్రసాదాల నాణ్యత, భక్తులకు రూ.50లకే ఓబడా ప్రసాదం పంపిణీ తదితర విషయాలపై కమిటీ సభ్యుల అభిప్రాయాలను అధికారులు సేకరించారు. గత రథయాత్రలో ఖర్చులపైనా కలెక్టర్ చర్చించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య రథయాత్రలో అధికంగా ఉంటుందని, దీనిని అధిగమించాలని పోలీసు అధికారులకు సూచించారు.


