భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వేకు చెందిన ఖుర్దా రోడ్ మండలం 2025–26 ఆర్థిక సంవత్సరంలో జోనల్ స్థాయిలో టికెట్ తనిఖీల ద్వారా అత్యధిక ఆదాయం ఆర్జించడం విశేషం. ఈ సాఫల్యత టికెట్ తనిఖీల పనితీరులో మైలురాయిని ఆవిష్కరించిందని అధికార వర్గాలు టికెట్ తనిఖీ సిబ్బందిని అభినందించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 7.38 లక్షల అనధికార, అక్రమ ప్రయాణికుల నుండి చార్జీలు, జరిమానాల రూపంలో మొత్తం రూ. 39.71 కోట్లు వసూలు చేశారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 21 శాతం పెరుగుదలను సూచిస్తుందని విభాగం ప్రముఖ అధికారి సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అనిల్ కుమార్ ఎస్ తెలిపారు. ఖుర్దారోడ్ మండల వ్యాప్తంగా వివిధ రైళ్లు, స్టేషన్లలో సుమారు 3,000 విస్తృతమైన, ప్రత్యేక టికెట్ తనిఖీ దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనధికార ప్రయాణాలను అరికట్టి క్రమశిక్షణతో కూడిన ప్రయాణ వాతావరణం నిర్ధారణకు మండల టికెట్ తనిఖీ దాడులు మరింత ముమ్మరం చేస్తున్నారు.


