భువనేశ్వర్: 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) రగ్బీ చాంపియన్షిప్ 2025–26 అండర్ 17 పోటీలు కళింగ స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగాయి. ఈ పోటీల్లో ఆతిథ్య ఒడిశా బాలికల జట్టు టైటిల్ కై వసం చేసుకోగా, బీహార్ బాలుర జట్టు చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. అండర్ 17 బాలికల విభాగంలో ఒడిశా అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని గెలుచుకుంది. బీహార్ రన్నర్ అప్గా నిలిచింది. మహారాష్ట్ర మరియు ఢిల్లీ వరుసగా మూడు, నాల్గో స్థానాలను దక్కించుకున్నాయి.
అండర్ 17 బాలుర విభాగంలో ఫైనల్లో ఒడిశాపై బలమైన ప్రదర్శన కనబరిచిన బీహార్ విజయం సాధించింది. ఒడిశా రన్నరప్గా నిలిచింది. మహారాష్ట్ర, రాజస్థాన్ వరుసగా మూడు, నాల్గో స్థానాల్లో నిలిచాయి. అండర్ 17 విభాగం ముగింపు వేడుకకు క్రీడలు, యువజన సేవల డైరెక్టర్ డాక్టర్ యెద్దుల విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాజరైన ఇతర ప్రముఖులలో మాధ్యమిక విద్యా విభాగం డైరెక్టర్ బీరేంద్ర కోర్కోరా, సహాయ డైరెక్టర్ (పీఈటీ) జ్యోతి ప్రసాద్ పరిడా, టోర్నమెంట్ పరిశీలకుడు అరవింద్ యాదవ్ ఉన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ యెద్దుల విజయ్ యువ క్రీడాకారుల అంకితభావం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తిని ప్రశంసించారు. ఆయన విజేతలను అభినందించి పాల్గొన్న వారందరూ శ్రేష్ఠత కోసం నిరంతరం కృషి చేయాలి. ఉన్నత స్థాయి పోటీలను లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రోత్సహించారు. వ్యక్తులను అన్ని రంగాలలో రాణించేలా తీర్చిదిద్దడంలో పాఠశాల క్రీడల ప్రాముఖ్యతను మాధ్యమిక విద్యా విభాగం డైరెక్టర్ బీరేంద్ర కోర్కోరా వివరించారు. క్షేత్రస్థాయిలో రగ్బీని ప్రోత్సహించడంలో ఇలాంటి చాంపియన్షిప్లు కీలక పాత్ర పోషిస్తాయని టోర్నమెంట్ పరిశీలకుడు అరవింద్ యాదవ్ అన్నారు. ఈ చాంపియన్షిప్లో భాగంగా అండర్ 14 బాలురు, బాలికల మ్యాచ్లు ఈ నెల 9 మరియు 10 తేదీలలో కళింగ స్టేడియం ప్రాంగణంలో జరగనున్నాయి.


