పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్లో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ సి.హెచ్.వసంత్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరెక్టర్ (అడ్మిన్) డాక్టర్ దుర్గాప్రసాద్ పాడీ, డీన్ (స్టూడెంట్స్) డాక్టర్ రితీష్ కుమార్, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.ఎన్.సంధ్య, డెంటిస్టు డాక్టర్ సల్లాన శరత్కుమార్, తదితరులు హాజరయ్యారు. ఈ వర్క్షాపులో ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ గుండెపోటు వచ్చి పడిపోయినప్పుడు మనం ఎలా సీపీఆర్ చేయాలి, ప్రతిఒక్కరికీ ప్రాణాపాయం సమయంలో ప్రాథమిక జీవరక్షణ ఎలా చేయాలో ప్రిన్సిపాల్ ఎస్.ఎన్.సంధ్య తెలియజేశారు. దీనిపై నర్సింగ్ విద్యార్థులకు డెమో చేసి చూపించారు. సీపీఆర్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


