రాయగడ: పోలీస్ డీవీఎఫ్ సిబ్బంది జిల్లాలోని వివిధ అటవీ ప్రాంతాల్లో నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లలో భారీ పరిమాణంలో పేలుడు పదార్థాలు, తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ మంగళవారం డీపీఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంతో వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి నెలలో నిఖిల్, ఇందులతొ సహా 15 మంది మావోయిస్టులు పోలీసుల సమక్షంలో లొంగిపోయిన తర్వాత కలహండి, రాయగడ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన మునిగుడ, అంబొదల పోలీస్ స్టేషన్ల పరిధిలో గల పజిగరేగ, అంబ్రికొల్, పటానాని తదితర గ్రామాల్లో గల అటవీ ప్రాంతాల్లో డీవీఎఫ్ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆయా ప్రాంతాల్లొ మావోయిస్టుల డంప్లను గుర్తించారు. ఆయా డంప్లలో 415 డిటోనేటర్లు, 8 కార్డెక్స్ కట్టలు, 29 కిలొల 3 గొనె సంచుల్లొ అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలు, 2 సింగిల్ షాట్ తుపాకీలు, మరొ బీజీఎల్ తుపాకీ, ఒక ల్యాప్టాప్, చార్జర్, రెండు విద్యుత్ తీగల కట్టలు, ఎర్రటి గుడ్డ, ప్లాస్టిక్ కంటైనర్లు తదితరమైనవి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టుల కదలికలు జిల్లాలో లేవని ఒక ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు.


