● పార్లమెంట్లో కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ఆవేదన
కొరాపుట్: జిల్లాలోని దశమంతపూర్ సమితి డెంగాజానీగుడ గ్రామంలో గిరిజనుల జీవితాలపై పార్లమెంట్లో కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో దమంజోడిలోని భారత అల్యూమినియ కేంద్రం (నాల్కో) వినియోగించిన బూడిద వలన రెడ్మెడ్ పాండ్ ఏర్పడిందన్నారు. దానివలన గిరిజనులు అనారోగ్యాల బారిపడుతున్నారని వాపోయారు. ఇప్పటికే కొందరు క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారని తెలిపారు. అందువలన అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించారు. కేంద్ర గనుల శాఖ మంత్రి స్వయంగా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
బిసంకటక్లో భారీవర్షం
రాయగడ: జిల్లాలోని బిసంకటక్లో శనివారం భారీవర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. కాలువల్లోని మురుగు నీరు రోడ్లపైకి రావడంతో చెత్తతో రోడ్లు నిండిపోయాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్ నుంచి గౌడవీధి, డుకుం రోడ్డు, మెయిన్ రోడ్డు, తెల్లివీధి, బొడొద్వారా వీధులు పూర్తిగా జలమయమయ్యాయి. గత కొద్దికాలంగా మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఆత్మీయ సమ్మేళనం నేడు
పర్లాకిమిడి: స్థానిక ఆర్.సీతాపురంలోని సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఆడిటోరియంలో తెలుగు ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో సీబీ రామచంద్రరావు (ఐఏఎస్), హైటెక్ మెడికల్ కళాశాలలు, ఆస్పత్రుల చైర్మన్ డా.తిరుపతి పాణిగ్రాహి, సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డీఎన్రావు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్రావులను సన్మానించనున్నారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్య అతిథిగా హాజరవుతారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, భువనేశ్వర్ నుంచి మిరాకిల్ డ్యాన్సు, కూచిపూడి నృత్యాలు ఉంటాయని డా.సయ్యద్ రహింతుల్లా తెలిపారు.
చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా పోలీస్స్టేషన్లో చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు నితి శేఖర్ శనివారం ప్రారంభించారు. పోలీసుస్టేషన్కు వచ్చే కక్షిదారులు, బాధితుల పిల్లలు ఈ గదిలో బొమ్మలతో ఆడుకునే సౌకర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా, సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్కుమార్, మోహనా ఐఐసీ ఓం నారాయణ్ పాత్రో తదితరులు పాల్గొన్నారు.
అగ్నిమాపక దళం మాక్డ్రిల్
మల్కన్గిరి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో అగ్నిమాపక దళం అధికారులు శనివారం మాక్డ్రిల్ నిర్వహించారు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదాలు జరిగితే ఎలా తప్పించుకోవాలో వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు సపాన్ కుమార్ పిండా, నర్సింగ్ ఆఫీసర్ ఇన్చార్జి సంజులతా సేఠీ, ఆస్పత్రి మేనేజర్ విశ్వజీత్ తదితరులు పాల్గొన్నారు.


