జయపురం: సబ్ డివిజన్ పరిధి కోట్పాడ్ సమితి బతాసన గ్రామ పంచాయతీలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీ బొతాసన శాఖ కార్యదర్శి పూర్ణచంద్ర సుర కోరారు. గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ సమావేశం పార్టీ నేత కుమురునాథ్ భొత్ర అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ర మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ భూముల్లోని ఆక్రమణలు తొలగించాలని పలుమార్లు కోట్పాడ్ తహసీల్దార్కు విజ్ఞప్తి చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి జుదిష్టర్ రౌళో మాట్లాడుతూ.. భూమి ఆక్రమణలతో పాటు పంచాయతీలో నెలకొన్న సమస్యలపై ఏప్రిల్ 2వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాలని సూచించగా అందుకు సమావేశం అంగీకరించింది. కోట్పాడ్ సమితి గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ శాఖలు ఏర్పాటు చేయాలని, సభ్యత్వ నమోదు, నిధుల సేకరణ కార్యక్రమాలు చేపట్టాలని రౌళో పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ నేతలు గోవర్ధన భొత్ర, త్రిపతి భొత్ర, గోపబందు హరిజన్, ముకుంద భొత్ర తదితరులు పాల్గొన్నారు.


