నరసన్నపేట: కోమర్తికి చెందిన దుంగ దిలీప్ కుమార్ సైబర్ క్రైమ్ బారిన పడ్డారు. విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న దిలీప్ కుమార్కు నాలుగు రోజుల కిందట ఒక వాట్సాప్ మెసేజీ వచ్చింది. ఆ మెసేజీ ఓపెన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.52 వేలు ఖాళీ అయ్యిందని శనివారం తెలిపారు. వెంటనే తేరుకొని బ్యాంకు అధికారులను సంప్రదించానని, పోలీసులను ఆశ్రయించాలని సూచించడంతో నరసన్నపేట సీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై సీఐ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా పరిశీలన చేస్తున్నామని అన్నారు.
శ్రీకాకుళం రూరల్: బొల్లినేని మెడిస్కిల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో ఇంటర్మీడియెట్ పూర్తి చేసి న విద్యార్థులకు ఫ్రంట్లైన్ హెల్త్కేర్ గివింగ్ అసిస్టెంట్, వెల్నెస్ థెరపిస్ట్గా ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 27 ఏళ్ల యువతీ యువకులు అర్హు లని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచితవసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్న ట్లు చెప్పారు. వివరాలకు 7995013422 నంబర్ను సంప్రదించాలని కోరారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలో 12వ పీఆర్సీని అమలు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే మూడేళ్లు కావస్తున్నా కొత్త పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రూ.30 వేల కోట్ల పైబడి బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉందని చెబుతున్న కూటమి ప్రభుత్వ పెద్దలు, సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమాంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.వైకుంఠరావు, జిల్లా సహాధ్యక్షుడు వై.ఉమాశంకర్, జిల్లా కార్యదర్శి బి.రవికుమార్, జి.సురేష్, జిల్లా నాయకులు బి.శ్యాం, వైకుంఠరావు, ఎల్.అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
మందస : కార్గో ఎయిర్పోర్టు వల్ల విలువైన భూములను కోల్పోయి రోడ్డున పడతామని మందస మండలం రాంపురం పంచాయతీ రాంపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామ సచివాలయం, తహశీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిర్పోర్టు వల్ల గ్రామంలో 115 మంది రైతులకు చెందిన దాదాపు 200 ఎకరాల భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని, ఉపాధి కోల్పోయి కోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సేకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం ఆలయ అనివెట్టి మండపంలో కొట్నం దంపు(సుగంధ ద్రవ్య మర్దనం) ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అర్చకులు సంప్రదాయ కీర్తనలు ఆలపిస్తూ ఉత్సవం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, కార్యనిర్వహణాధికారికె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ పాల్గొన్నారు.
– శ్రీకాకుళం కల్చరల్


