కంచిలి: భారత దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం ప్రచారం చేసేందుకు ఇద్దరు యువకులు ఉపక్రమించారు. ఒకరు సైకిల్తోను, మరొకరు స్కేటింగ్ చేస్తూ తిరుగుతున్నారు. సైక్లింగ్ చేసే అశుతోష్ పాండే ఈ ఏడాది జనవరి 20వ తేదీన బీహార్ రాష్ట్ర పరిధి శివాం జిల్లా నుంచి బయల్దేరి నేపాల్ బోర్డర్ వరకు వెళ్లి, మళ్లీ దక్షిణ భారతదేశం వైపు వచ్చారు. సైకిల్ వినియోగిస్తే డబ్బులు ఆదా కావడంతోపాటు వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ తగ్గుతుందని, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు. స్కేటర్ రాజా ఛార్దమ్ యాత్ర చేస్తూ 12 శక్తిపీఠాలను దర్శనం చేస్తూ ఆల్ ఇండియా టూర్ చేస్తున్నట్లు తెలిపారు.
వీరు ఇప్పటి వరకు 2500 కిలోమీటర్లు ప్రయాణించారు. మొత్తం 15వేల కిలోమీటర్లు ప్రయాణిస్తామని తెలిపారు. వీరిద్దరూ వేర్వేరుగా వీళ్ల ఆల్ ఇండియా యాత్రలు చేపడుతూ, కంచిలి వచ్చేటప్పుడు ఒక్కచోట కలిశారు. వీరికి కంచిలికి చెందిన వ్యాపారి సంజయ్ కుమార్ శర్మ ఆదివారం రాత్రి ఆతిథ్యం కల్పించి సత్కరించారు.


