న్యూస్రీల్
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026
ఉత్తమ జిల్లాగా..
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల్
● కొనసాగుతున్న ఉగాది ఉత్సవాలు
రాయగడ: ఖనిజ వనరులతో పాటు ప్రాకృతిక సంపదలకు నిలయమైన రాయగడ జిల్లాను రాష్ట్రంలొనే ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్నివిధాల కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సామల్ అన్నారు. జిల్లా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు నేతృత్వంలో స్థానిక కొల్లిగుడ వద్ద నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాకృతిక, ఖనిజ సంపదలు ఉన్న ఈ జిల్లా రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఎంతగానో దోహదపడుతోందన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్నివిధాల కృషి చేస్తోందన్నారు కొత్త పరిశ్రమలు జిల్లాలో నెలకొల్పేందుకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందితే ప్రజల ఆర్థిక, సామాజిక రంగాలు తదనుగుణంగా మెరుగుపడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నో బృహత్తర పరిశ్రమలు ఉన్నాయని అన్నారు. అయితే బాకై ్సట్ నిక్షేపాలు ఉన్న కారణంగా వాటిని సద్వినియోగపరిచాలని అందుకు పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులను ఆహ్వానించడం అనివార్యమని వివరించారు.
తెలుగు వారి నుంచి ఎంతో నేర్చుకొవాలి
భిన్న సంస్కృతి, సంప్రదాయాలు ఉన్న రాష్ట్రంలో తెలుగు సంప్రదాయానికి ఎంతో గొప్పతనం ఉందన్నారు. అవిభక్త కొరాపుట్ జిల్లాతో పాటు పశ్చిమ ఒడిశాలో కూడా తెలుగు వారు అత్యధికంగా నివసిస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో వారి నుంచి ఈ ప్రాంత రైతులు ఎంతో నేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. సంబల్పూర్ జిల్లాలోని అత్తాబిర తదితర తెలుగు ప్రాబల్యం గల ఆయా ప్రాంతాల్లో తెలుగు వారు వారి ప్రధాన వృత్తి వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నారని అన్నారు. కొత్త తరహా వ్యవసాయ విధానాలను అవలంబించి ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తుండడం గర్వకారణమని అన్నారు. కష్టే ఫలిగా నమ్మే వారి ఆచార, వ్యవహారాలు అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు.
ఉగాది ఉత్సవాలకు ఆహ్వానంపై ఆనందం
తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాదికి తనను ఆహ్వానించడం చాలా అనందంగా ఉందని ఎంపీ సామల్ అన్నారు. ఉగాది వంటి ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించడం రాష్టంలోనే రాయగడ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇంత ఆర్భాటంగా ఉత్సవాలను నిర్వహించడం తాను ఇదే మొదటిసారి చూడడమని అన్నారు. ఎంతో ఆదరాభిమానాలతో తనను ఆహ్వానించడంపై సంతోషం వ్యక్తం చేశారు.
సంస్కృతిని కాపాడుకోవాలి
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఉగాది వంటి గొప్పదినాన్ని మనమంతా ఒకే వేదికపై నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు అన్నారు. మూడేళ్లుగా జిల్లా తెలుగు సమాఖ్య పేరిట ఈ ఉత్సవాలను నిర్వహిస్తుండటం.. దానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండడం అందరి ఆదరాభిమామానాలకు నిదర్శనమని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరిక్షించుకోవాలనే తపనతో ఉత్కళ తెలుగు సమాఖ్య పేరిట ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. సమైఖ్యతతో నిర్వహిస్తున్న ఉత్సవాలు అందరినీ అలరించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఉత్సవాలకు గౌరవ అతిథిగా బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు, పర్లాకిమిడి మాజీ ఎమ్మెల్యే కొడూరు నారాయణరావు, ఆర్ఎస్ఎస్కు చెందిన చిత్త రంజన్ మహాంతి, బీజేపీ రాష్ట్రశాఖ సాధారణ కార్యదర్శి పూర్ణిమ నాయక్, సరోజ్కర్ తదితరులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఉగాది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జబర్ధస్త్ యాంకర్ సౌమ్యారావ్ కార్యక్రమానికి యాంకరింగ్ చేశారు. తెలుగ చలనచిత్ర నేపథ్య గాయని లిప్సిక, విఘ్నేష్లు తమ మధురమైన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇదిలాఉండగా ఉగాది ఉత్సవాల్లో భాగంగా ర్యాలీ ముగిసిన అనంతరం వర్షం గంటసేపువర్షం కురవడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. అయితే ఆతరువాత వర్షం తగ్గుముఖం పట్టడంతో తరువాత కార్యక్రమాలు యథావిధిగా జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న సంఘం సభ్యులు, ప్రతినిధులు
రాయగడ: స్థానిక కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సంఘం అధ్యక్షుడు కింతలి అమర్నాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో భాగంగా ఉదయం పంచాంగ పఠనం జరిగింది. సాయంత్రం సంఘం కార్యాలయ ప్రాంగణంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ నటి, గాయని అనురాధ పాణిగ్రహి పాల్గొని తెలుగు పాటను పాడి ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. కార్యక్రమంలో సంఘానికి చెందిన చంద్రమౌళి కుముందాన్, సూరి అప్పలస్వామి, వడ్డి మురళి, చక్రధర్ పాత్రుడు, స్పందన సాహితీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గుడ్ల గౌరి ప్రసాద్, టి.జయరాం తదితరులు పాల్గొన్నారు.


