కొరాపుట్: పిల్లల దొంగ అనే నెపంతో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన ఘటనలో 9 మంది అరెస్టు అయ్యారు. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్ర పోలీస్స్టేషన్ ఐఐసీ సంబిత్ బెహరా ఈ కేసు వివరాలు ప్రకటించారు. ఈనెల 16వ తేదీన కెందుగుడ గ్రామ సమీపంలోని చికిల్పొదర్ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మతిస్థిమితం లేని వ్యక్తి (57) సంచరిస్తున్నాడు. అతను పిల్లల దొంగ అనే అనుమానంతో గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనని స్థానిక యువకులు సెల్ఫోన్ల లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది చూసిన పోలీసులు వీడియోలు ఆధారంగా విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా ఈ ఘటనకి పాల్పడిన దేవేంద్ర కుమార్ బోత్ర, మాన్సింగ్ బోత్ర, పరమానంద బోత్ర, మచింద్ర బోత్ర, గధాదర్ పట్లి, డొము బోత్ర, సితారం బోత్ర, ధనుపతి రంధారి, ఫకీర్ మెహన్ నాయక్లను అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.


