అంబొదళలో యువకుడి దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదళ పోలీస్స్టేషన్ పరిధిలొ గల రైల్వే స్టేషన్ అతిథి గృహం సమీపంలొ ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు యువకుడి తలపై బండరాయితో కొట్టి గుర్తు పట్టలేని విధంగా గాయపరిచారు. మృతుడు అంబొదళ రైల్వే స్టేషన్ వీధిలో నివసిస్తున్న సింహాచల్ సాహు(47) గా గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు,సైంటిఫిక్ బృందం చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలం వద్ద ఒక కత్తి, వినియోగించిన నాటు తుపాకీకి చెందిన రెండు బుల్లెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... శనివారం నాడు సాహు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాత్రి అయినా ఇంటికి చేరలేదు. అయితే ఆదివారం ఉదయం రైల్వే స్టేషన్ అతిథి గృహం వద్ద ఒక మృతదేహం పడి ఉందనే సమాచారంతో బాధిత కుటుంబీకులు అక్కడకు చేరుకుని మృతదేహం సాహుదేనని గుర్తు పట్టారు. గుర్తు తెలియని దుండగులు సాహుని అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్డిపిఒ సంతొషిని ఒరం, అంబొదళ పోలీస్ స్టేషన్ ఐఐసీ కల్పన బెహర సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇదిలాఉండగా పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో భాగంగా మృతుడు సింహాచల్ సాహుపై రాయగడ ఇతర జిల్లాల్లొ కొన్ని కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే ఈ హత్యకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తేనే వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. అయితే పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
అంబొదళలో యువకుడి దారుణ హత్య
అంబొదళలో యువకుడి దారుణ హత్య
అంబొదళలో యువకుడి దారుణ హత్య


