శిథిలమైన ఆర్అండ్బీ వంతెన
● ఆందోళనలో ప్రజలు
పర్లాకిమిడి: మోహనా–అడవ, పాణిగండ రోడ్డులోని మూడు స్పాన్ల వంతెన శిథిలావస్థకు చేరింది. 72 ఏళ్ల క్రితం నిర్మించిన మోహనా వంతెన రోడ్లు భవనాల శాఖ నిర్లక్ష్యంతో ఏ క్షణంలోనైనా కూలిపోయే స్థితిలో ఉంది. మలస్పదర్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నీరు బోడోనదిగా మారి తిన్నగా హారభంగి డ్యాంలో కలుస్తున్నది. అయితే ఈ వంతెన వద్ద మోహనా ప్రజా ఆరోగ్య సిబ్బంది, బీడీవో అధికారులు సరైన వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియను చేపట్టకపోవడంతో స్థానికులు వంతెన వద్ద చెత్తను వేస్తున్నారు. అటు బరంపురం, రాయగడ జిల్లాలకు కలుపుతూ వస్తున్న ఈ వంతెనకు అధికారులు కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు. దీంతో స్థానికులు దుర్ఘంధం భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా మోహనా రోడ్లు భవనాల శాఖ ఇంజినీరు శాఖ తగు చర్యలు చేపట్టి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


