
కల్వర్టుల పూర్తి కలేనా?
● జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన 44 కల్వర్టులు
● రెండింటికి మాత్రమే మంజూరైన నిధులు
పార్వతీపురం రూరల్: రహదారులపై అధ్వానంగా భారీ గుంతలు ఏర్పడి వాహన చోదకులను ప్రమాదాలకు గురిచేస్తుంటే ఇంకోపక్క రహదారిపై ఉన్న కల్వర్టులు శిథిలావస్థకు చేరి, కుంగిపోయి మరింత భయాందోళనకు వాహనచోదకులను గురిచేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా రహదారులపై 44 కల్వర్టులు శిథిలావస్థకు చేరాయి. వాటి నిర్మాణాల నిమిత్తం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు, అంచనా విలువలు అధికారులు పంపించారు. అయితే ప్రస్తుతం రెండు కల్వర్టులకు సంబంధించి మాత్రమే నిధులు మాత్రమే మంజూరయ్యాయని, మరో 133 కల్వర్టులకు మరమ్మతులు చేసేందుకు కూడా నివేదికలు పంపామని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రహదారులు దారుణంగా గోతులమయమై వాహనాల రాకపోకలకు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రహదారుల్లో కనీస స్థాయిలో మరమ్మతులు సైతం సక్రమంగా నిర్వహించడం లేదు. జిల్లా కేంద్రం నుంచి కొరాపుట్కు వెళ్లేందుకు ఉన్న రహదారిపై మరమ్మతులు ప్రారంభించి కొన్ని భారీ గుంతలు మాత్రమే పూడ్చి పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రహదారిపై అక్కడకక్కడ ఏర్పడిన గుంతల్లో రాళ్లు తేలి మరమ్మతులకు నోచుకోకపోవడంతో సమస్యకు పూర్తి పరిష్కారం కాలేదని వాహన చోదకులు, ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్ల నిర్మాణం ఎప్పుడో?
రహదారి నిర్మాణం, మరమ్మతులకు సంబంధించిన 97పనులకు నిధులు మంజూరు కాగా 324 కిలోమీటర్ల రహదారి పనులను ప్రారంభించి 295 కిలోమీటర్లు పనులు పూర్తిచేశామని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో ఇప్పటికీ దారుణమైన గుంతలతో రహదారులు దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 324 కిలోమీటర్ల పరిధిలో పనులు చేశామని ఆర్అండ్బీ పరిధిలో మరో 150 కిలోమీటర్ల రోడ్ల పనులకు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇంకా చాలా ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన రహదారుల పనులపై ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో స్పష్టత ఇవ్వడం లేదు. అంచనాలు వేస్తున్నామంటూ దాటవేస్తున్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో బైపాస్రోడ్డు, పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి, లక్ష్మీనారాయణపురం, సంగంవలస, సీతంపేట తదితర గ్రామాల రోడ్లు గుంతలతో నేటికీ అధ్వానంగా ఉన్నాయి. మరి ఈ రోడ్డు పనులు ఎప్పుడు నిర్వహిస్తారో? ప్రభుత్వం నిధులు మంజూరు చేసేదెప్పుడో? అర్థం కాని పరిస్థితి నెలకొంది. జిల్లా ఉన్నతాధికారులు, పాలకులు రోజూ కళ్లారా చూస్తూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్న రహదారులపై ముఖం చాటేస్తూ దాటేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య వాహన చోదకులు అధికారులు, పాలకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నివేదికలు సిద్దం చేస్తున్నాం
ఆర్అండ్బీ పరిధిలో గత అక్టోబర్లో మంజూరైన నిధుల మేరకు 324 కిలోమీటర్ల రహదారి పనులు ప్రారంభించి 295 కిలోమీటర్ల పనులు పూర్తి చేశాం. అలాగే కల్వర్టులకు సంబంధించి 44చోట్ల పునర్నిర్మాణాల కోసం, 133 కల్వర్టుల మరమ్మతులకు సంబంధించి అంచనాలతో కూడిన నివేదికలను పంపించాం. అయితే రెండు కల్వర్టుల పునర్నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరయ్యాయి. మిగతా వాటికి మంజూరు కావాల్సి ఉంది. రహదారులపై అవసరమైన చోట తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాం.
రాధాకృష్ణ, ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పార్వతీపురం, మన్యం జిల్లా

కల్వర్టుల పూర్తి కలేనా?

కల్వర్టుల పూర్తి కలేనా?

కల్వర్టుల పూర్తి కలేనా?