ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు
● ఒడియా భాషలో నామ ఫలకాలు
● ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలను ఏకరీతి కాషాయ నేపథ్య రంగుతో వన్నె దిద్దనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలైనట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ భవనాల మరమ్మతులు, పునరుద్ధరణల సమయంలో ఈ కార్యాచరణ అమలు చేస్తారు. అంచెలంచెలుగా ప్రభుత్వ భవనాలు సమగ్రంగా కాషాయ నేపథ్య రంగు శోభతో కొత్త రూపు దాల్చుకోనున్నాయి. ఈ కార్యాచరణ కోసం నమూనా రంగు శైలిని జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా..
రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు, వాణిజ్య సంస్థల పేరు తదితర వివరాల్ని ఒడియా భాషలో రాయాలని ఆదే శాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల కార్యాచరణ కోసం ప్రధాన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. నామ ఫలకంపై (సైన్ బోర్డు) 60 శాతం ఒడియా భాషలో వివరాలు రాయాల్సి ఉంటుంది. నామ ఫలకాలపై ఒడియా భాషలో రాతల కోసం తొలి అవకాశం కింద సముచిత సవరణ కోసం 55 రోజుల గడువు మంజూరు చేస్తారు. గడువులోగా సవరణలు పూర్తి కాకుంటే సరిదిద్దే వరకు రోజుకు రూ.500 చొప్పున జరిమానా విధించడం జరుగుతుందని, రాష్ట్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధిశాఖ ప్రముఖ కార్యదర్శి ఉషా పాఢి రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (ఎన్ఏసీ)లకు లేఖ జారీ చేశారు.


