తోట్లవల్లూరు: పెళ్లి వేడుకకు వచ్చిన ఓ మహిళ తన బంగారం పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. తోట్లవల్లూరు మండలంలోని గరికపర్రు గ్రామంలో తమ బంధువుల ఇంటిలో జరిగిన వివాహ వేడు కకు పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన దావు సుకన్య తన కుటుంబంతో హాజరయ్యారు. పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా తన 40 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమైనట్లు సుకన్య గుర్తించింది. ఎంత ప్రయత్నించినా బంగారు ఆభరణాల ఆచూకీ లభ్యం కాకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిషోర్ తెలిపారు.
హాస్టల్ వాచ్మన్ మృతి
గంపలగూడెం: స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వాచ్మన్ కొమ్మరవల్లి గంగరాజు(58) శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. హాస్టల్ ప్రాంగణంలో ఉన్న ఓ బల్లపై అనారోగ్యంగా కనిపించడంతో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడు రావూరి స్వామి గంగరాజును గమనించాడు. తొలుత గంగరాజు నోటి నుంచి రక్తం వచ్చిందని, అనంతరం అతను మృతిచెందా డని స్వామి తెలిపాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గంగరాజు స్వగ్రామం విజయవాడ సమీపంలోని గూడ వల్లి. మృతుని కుమారుడు గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శశిధర్ తెలిపారు.


