గన్నవరం: ఆర్థిక ఇబ్బందులు, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో పోలీసుల వేధింపులను తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గన్నవరంలోని గాజులపేటలో నివసించే పడమట నాగరాజు దావాజిగూడెం రోడ్డులో పండ్ల దుకాణం నడుపుతున్నాడు. ఐదేళ్ల క్రితం సమీప బంధువు ఓ ఫైనాన్స్ సంస్థలో తీసుకున్న రుణానికి నాగరాజు ష్యూరిటీ సంతాకం చేశాడు. ఆ బంధువు రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు అప్పు చెల్లించాలని నాగరాజును వేధిస్తున్నారు. అంతే కాకుండా తాడేపల్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి నాగరాజు ద్వారా ఓ బుకి వద్ద క్రికెట్ బెట్టింగ్లు వేసి రూ.5 లక్షలు నష్టపోయారు. ఈ వ్యవహారం పోలీస్స్టేషన్కు చేరడంతో ఆ రూ.5 లక్షలకు నాగరాజును బాధ్యుడిని చేసి తిరిగి చెల్లించాలని పోలీసులు ఒత్తిడి చేశారు. ఈ విషయమై నాగరాజును స్టేషన్కు పిలిపించి గట్టిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన నాగరాజు గుంటూరు సమీపంలోని పొలాల్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు అతనిని గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతి చెందాడు. ఫైనాన్స్ సంస్థతో పాటు పోలీసులు వేధింపుల కారణంగానే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. నాగరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


