
న్యూఢిల్లీలో అమరావతి ప్రాపర్టీ షో బ్రోచర్ ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతిష్టాత్మకంగా న్యూఢిల్లీలో ప్రారంభమైన 17వ నారెడ్కో జాతీయ సదస్సులో శనివారం అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 బ్రోచర్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. అమరావతిని భవిష్యత్లో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల ముఖ్య కేంద్రంగా ప్రదర్శించడానికి ఈ ఫెస్టివల్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. నారెడ్కో ప్రతినిధులు మాట్లాడుతూ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025లో నివాస, వాణిజ్య ప్రాజెక్టులతో పాటు ప్రభుత్వ దూరదృష్టి, పెట్టుబడి సౌహార్ధ విధానాలు, సమగ్ర టౌన్షిప్ ప్రణాళికలు ప్రదర్శిస్తారని తెలిపారు. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా పెట్టుబడిదారులు, అభివృద్ధిదారులు, ఎన్ఆర్ఐలు, విధాన నిర్ణేతలు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష, ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ జి.సూర్య ప్రవీణ్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, నారెడ్కో జాతీయ అధ్యక్షుడు జి.హరిబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.చక్రధర్, సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మండవ, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పరుచూరి తదితరులు హాజరయ్యారు.