
ప్రకృతి మాతకు ప్రణామం
సకల ప్రాణకోటికి తన శరీరం నుంచి ఆకులు, ఫలాలు, కాయగూరలు, తిండి గింజలను అందించిన ప్రకృతిమాత శాకంబరిగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కొలువుదీరారు. వనదేవత అలంకారంలో కొలువైన దుర్గమ్మను భక్తులు దర్శించుకుని తరించారు. ప్రకృతి మాతకు ప్రణామాలు అర్పించారు. చల్లంగా చూడు దుర్గమ్మా అంటూ వేడుకున్నారు. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం శాకంబరి ఉత్సవాలు అంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గా మల్లేశ్వర స్వామి వార్లతో పాటు ఘాట్రోడ్డులోని కామథేను అమ్మ వారు, ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో దేవతా మూర్తులను కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించారు. నూతన యాగశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఈఓ శీనానాయక్, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయం, ఉపాలయాలను కరివేపాకు, నిమ్మకాయలు, వివిధ రకాల కాయగూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో కూరగాయలతో ఏర్పాటు చేసిన శివలింగాకృతి, పక్కనే స్వామి వారికి నమస్కరిస్తున్న అమ్మవారు, కుమార స్వామి, గణపతి ప్రతిమలు ఆకట్టుకున్నాయి. నీటి కొలనులో సొరకాయలతో తీర్చిదిద్దిన హంసలు, దోసకాయలతో రూపొందించిన బాతులు భక్తులను కనువిందు చేస్తున్నాయి. కాకరకాయలతో చేసిన మొసలి విశేషంగా ఆకట్టుకుంంది. అమ్మవారి ప్రతిమ ఎదుట సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని శాకంబరీగా అలంకరించిన ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సారెను స్వీకరించారు.
ఇంద్రకీలాద్రిపై ఘనంగాశాకంబరి ఉత్సవాలు ప్రారంభం కూరగాయలు, ఆకుకూరలతో దుర్గమ్మకు అలంకరణ మూడు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు
కదంబం కోసం బారులు తీరిన భక్తులు
శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారికి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లతో అలంకారం ప్రత్యేకత. ఆ కూరగాయలను ఉపయోగించే తయారు చేసే కదంబ ప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు. ఏడో అంతస్తులో ఉచిత ప్రసాద వితరణ వద్ద ఉదయం ఆలయ ఈఓ శీనానాయక్ అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. పిల్లా పాపలతో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తబృందాలు కదంబ ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ అన్నప్రసాద తయారీ పోటులో కదంబ ప్రసాద తయారీని పరిశీలించారు. ప్రసాదం తయారీలో ఇబ్బందులు లేకుండా భక్తుందరికీ అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చే సిన భక్తులు కాయగూరలు, ఆకుకూరలతో తయారు చేసిన దండలను సమర్పించారు.

ప్రకృతి మాతకు ప్రణామం

ప్రకృతి మాతకు ప్రణామం