
రేషన్ షాపుల్లో నో స్టాక్
మచిలీపట్నంఅర్బన్: కూటమి ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో ప్రజలను అష్టకష్టాలు పెడుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంపిణీచేసే ఎండీయూ వాహనాలను రద్దు చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల వద్దనే కార్డుదారులకు సరుకుల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. రేషన్ కోసం లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. 15వ తేదీ వరకు షాపుల్లో సరుకులు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని 12వ వార్డు జన శక్తి నగర్, 8వ వార్డు పరాసుపేట రేషన్ డీలర్ల వద్ద 11వ తేదీ నుంచి నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నిత్యావసరాల కోసం వచ్చిన కార్డుదారులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. మరి కొంత మంది తప్పని పరిస్థితుల్లో ఎన్నో ప్రయాసలు పడి ఇతర వార్డుల్లోని డీలర్ల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ తీరుతోనే తమకు రేషన్ సరుకులు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతి చౌకధరల దుకాణం వద్ద షాపు, డీలర్ వివరాలు, ఫిర్యాదు చేసేందుకు సంబంధిత అధికారుల ఫోన్ నంబరుతో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలన్న నిబంధన డీలర్లు తుంగలో తొక్కారు. స్టాకులేదన్న బోర్డులను చూసిన లబ్ధిదారులు ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కానీ పరిస్థితి నెలకొంది.