డిచ్పల్లి (నిజామాబాద్రూరల్): మండలంలోని మెంట్రాజ్పల్లి గ్రామంలో వీధి కుక్క దాడిలో ఓ బాలుడికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం వీధిలో ఆడుకుంటున్న మగ్గిడి సాయి హర్షిత్ అనే నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. బాలుడి అరుపులు విన్న తల్లిదండ్రులు మగిడి పద్మ, మగ్గిడి వినోద్ వెంటనే బయటకు పరిగెత్తుకొని వచ్చి కుక్కను తరిమేయడంతో పెద్ద ప్రమా దం తప్పింది. గాయపడిన బాలుడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అధికారులు స్పందించి కుక్కలు, కోతుల బెదడను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
మోర్తాడ్: ఏర్గట్ల మండలం బట్టాపూర్ నుంచి వెల్కటూర్కు మొరం తరలిస్తున్న ట్రాక్టర్ శుక్రవారం పెద్దవాగు వంతెనపై నుంచి వాగులో పడిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. వెల్కటూర్కు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ పెద్దవాగు వంతెనపైకి చేరుకోగానే అదుపు తప్పి ఇంజిన్ వాగులో పడింది. గమనించిన డ్రైవర్ పల్లెపు శేఖర్కు కిందికి దూకడంతో అతని చేయి విరిగింది. ట్రాక్టర్పై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
నిజామాబాద్ అర్బన్ : నగరంలోని మిర్చి కంపౌండ్లో గురువారం రాత్రి భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం... మిర్చి కంపౌండ్లో రాధ అనే మహిళ కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ నివసిస్తోంది. శుక్రవారం తన భర్త బాబు ఇంటికి వచ్చాడు. అదే సమయంలో రాధ బయటకు వెళ్తానని చెప్పడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో బాబు కత్తితో రాధపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకొని బాబును రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు.
నిజామాబాద్ అర్బన్ : నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా సమీపంలోని హనుమాన్ ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలోకి చొరబడిన దొంగలు హుండీని పగులగొట్టి రూ.20 వేల నగదును ఎత్తుకెళ్లారు. రెండో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


