నిజామాబాద్ రూరల్: సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు, సీఐటీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ (45) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె, శనివారం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. నూర్జహాన్ జీవితం మొత్తం పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. ఆమె మరణంతో కా ర్మిక ఉద్యమాలకు, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు పెద్ద దిక్కు కోల్పోయినట్టైంది. కార్మికుల పక్షాన కేవలం ఆందోళనలు మాత్రమే కాకుండా, స్థానిక స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలను అధికారులతో చర్చల ద్వారా పరిష్కరించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. నూర్జహాన్కి భర్త ఆనంద్ (ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు), కొడుకులు అబ్బాస్, ఆజాద్ ఉన్నారు. నూర్జహాన్ మృతిపట్ల కార్మిక సంఘాల నాయకులు నివాళులు అర్పించారు.
ఘన నివాళులు అర్పించిన నేతలు
నూర్జహాన్ భౌతికకాయాన్ని ర్యాలీగా ఆస్పత్రి నుంచి సీపీఎం పార్టీ కార్యాలయానికి తరలించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు అబ్బాస్, బుర్రి ప్రసాద్, భూపాల్, కాంగ్రెస్ కార్పోరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నాయకులు మల్యాల గోవర్ధన్, ప్రజా సంఘాల నాయకులు, వామపక్ష పార్టీ నాయకులు, విద్యార్థి ఉద్యమ సంఘాల నాయకులు ఘన నివాళులు అర్పించారు. రమేశ్బాబు, దండి వెంకట్, సిద్ధిరాములు, పెద్దివెంకట్రాములు, కంజర్ భూమయ్య, వేల్పూర్ భూమయ్య, కోయ్యడి నర్సింలు, సుధాకర్, ఓమయ్య, ఆకుల పాపయ్య, సుధాకర్, వనమాల కృష్ణ, శంకర్గౌడ్, చంద్రశేఖర్, అనిత, సుజాత, సబ్బని లత, నీలం సాయిబాబా తదితరుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. సీఐటీయూ కార్యాలయంలో నూర్జహాన్ సిపిఐ (ఎం–ఎల్ )న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు నివాళులర్పించారు. బాన్సువాడలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.


