రుద్రూర్: పొతంగల్ మండలం జల్లపల్లి ఫారంకు చెందిన రసూల్ ఖాన్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కోటగిరి ఎస్సై సునీల్ శుక్రవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రసూల్ ఖాన్ ఈ నెల 18న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. రసూల్ ఖాన్ కుమారుడు కై ఫ్ ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రుద్రూర్: పొతంగల్ మండలం కల్లూరు గ్రామంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను శుక్రవారం తెల్లవారు జామున పట్టుకున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులకు గ్రామంలో కొందరు అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించి ట్రాక్టర్లను పోలీస్స్టేషన్ తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కాపర్ కాయిల్స్ చోరీ
నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని సిర్పూర్ శివారులో దుండగులు పంట పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ కాయిల్స్ను దొంగిలించారని ఎస్సై సుస్మిత శుక్రవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెలుమ మహిపాల్ వ్యవసాయ క్షేత్రంలో దుండగులు గురువారం రాత్రి ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ కాయిల్స్ను చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సుస్మిత ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


