సాంగ్లీకి వెళ్లినా నిరాశే..
మోర్తాడ్(బాల్కొండ): పసుపు కొమ్ములను మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్కు తీసుకెళ్తున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. నిజామాబాద్ మార్కెట్తో పోలిస్తే అక్కడ క్వింటాల్కు రూ.1500 నుంచి రూ.2వేల వరకు మాత్రమే అధికంగా ధర లభిస్తోంది. సాంగ్లీలో ఎక్కువ ధర లభిస్తుందని ఆశించిన రైతులకు ప్రస్తుతానికి నిరాశే మిగులుతోంది. రూ.15వేల నుంచి రూ.18వేల వరకు ధర లభిస్తుందనే ఆశతో జాతీయ పసుపు మార్కెట్గా ప్రసిద్ధి చెందిన సాంగ్లీ మార్కెట్కు పూర్తిగా ఎండిన పసుపును రైతులు తరలిస్తుండగా.. అక్కడ రూ.13వేల నుంచి రూ.16వేల ధర లభిస్తోంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో రవాణాచార్జీలు భరించి అక్కడికి పసుపు కొమ్ములను తీసుకెళ్లే బదులు ఇక్కడే విక్రయించేస్తేనే మేలని రైతులు భావిస్తున్నారు. ధర బాగుంటే రవాణా చార్జీలు ఎంత ఎక్కువ ఉన్నా ఫర్వాలేదని, కానీ ఇక్కడి ధరకు అక్కడి ధరకు పెద్ద వ్యత్యాసం లేదంటున్నారు. సాంగ్లీ మార్కెట్లో ఈ ప్రాంత పసుపునకు డిమాండ్ ఉండటంతో ధర ఈసారి ఎక్కువ పలుకుతుందని భావించామంటున్నారు. నిజామాబాద్ మార్కెట్లో రూ.14వేల వరకు ధర లభిస్తుండగా, నాణ్యత ఉన్న పసుపునకు రూ.15వేల వరకు ధర దక్కుతోంది. బాల్కొండ, ఆర్మూర్, రూరల్ నియోజకవర్గాలలోని కొన్ని గ్రామాల రైతులే సాంగ్లీ మార్కెట్కు పసుపును ప్రతి సీజన్లో తరలిస్తారు. ఈసారి ధరలో పెద్ద మార్పు లేక పోవడంతో మున్ముందుఎలాంటి పరిస్థితి ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.
పసుపునకు దక్కని ధర
క్వింటాల్కు రూ.13వేల నుంచి
రూ.16వేలు..
నిజామాబాద్లో రూ.14వేల
నుంచి రూ.15వేలు


