పెద్దపులొచ్చింది | - | Sakshi
Sakshi News home page

పెద్దపులొచ్చింది

Dec 16 2025 4:53 AM | Updated on Dec 16 2025 4:53 AM

పెద్దపులొచ్చింది

పెద్దపులొచ్చింది

పెద్దపులొచ్చింది

అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అది కూడా మైదాన ప్రాంతంలో తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట మండలాల సరిహద్దు ప్రాంతంలోని ఎగువ మానేరు జలాశయం ఎగువ భాగాన పెద్దపులి తిరుగుతున్నట్టు స్పష్టమైంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

దోమకొండ మండలం అంబారిపేట శివారులోని పంట చేల వద్ద ఆదివారం దూడలపై దాడి నేపథ్యంలో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో పాదముద్రలను పరిశీలించిన అధికారులు.. అవి కచ్చితంగా పెద్దపులివే అన్న నిర్ధారణకు వచ్చారు. వెంటనే అక్కడికి చుట్టుపక్కల ప్రాంతంలో కెమెరా ట్రాప్స్‌ ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దూడలను చంపిన ప్రాంతంలో పులి సంచరించినట్లు కెమెరాల్లో రికార్డయ్యింది. జిల్లా అటవీ అధికారి బోగ నిఖిత ఆ ప్రాంతాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు.

రైతుల్లో ఆందోళన

జిల్లాలో పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. టైగర్‌ తిరిగిన ప్రాంతమంతా వ్యవసాయ క్షేత్రాలే కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి వరి నాట్లు వేయడానికి సన్నద్ధమవుతున్నవారు భయపడుతున్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో రామారెడ్డి, మాచారెడ్డి, సిరికొండ మండలాల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించి ఆవులపై దాడులు చేసింది. అయితే దాని జాడ కోసం దాదాపు నెల రోజుల పాటు అటవీ అధికారులు నిఘా వేసినా అది ఎటువైపు వెళ్లిందో తేల్చలేకపోయారు. నాలుగు నెలల తర్వాత మరో పులి రావడం సంచలనంగా మారింది. మైదాన ప్రాంతంలో తిరుగుతున్న పెద్దపులి ఎవరిపై పంజా విసురుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పెద్దపులి జాడ వెలుగు చూసిన అంబారిపేటకు చుట్టుపక్కల గ్రామాలైన గోపాల్‌పేట, కోనాపూర్‌, యాడారం, ఫరీదుపేట, బండరామేశ్వర్‌పల్లి, లచ్చాపేట తదితర గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు.

కవ్వాల్‌ నుంచి వచ్చిందా...?

అంబారిపేట ప్రాంతంలో పెద్దపులి జాడలు బయటపడిన నేపథ్యంలో అది ఎక్కడి నుంచి వచ్చిందన్న వి షయమై అటవీ అధికారులు దృష్టి సారించారు. మన దగ్గర పులులు లేవన్న కచ్చితమైన అభిప్రాయంతో ఉన్న అటవీ అధికారులు.. అప్పట్లో జిల్లాలో తిరిగిన పెద్దపులి కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి వివిధ జిల్లాలు తిరుగుతూ వచ్చిందని పేర్కొన్నారు. సిరికొండ, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో దాని క దలికలు బయటపడ్డాయి. అయితే అప్పట్లో ట్రాప్‌ కె మెరాల ద్వారా దాని కదలికలు కనుక్కునే ప్రయ త్నం చేసినా ఫలించలేదు. అది ఎటువైపు వెళ్లిందన్న దీ స్పష్టం కాలేదు. తాజాగా అంబారిపేట ప్రాంతంలో దూడలపై పెద్దపులి దాడి చేయడంతో అటవీ అ ధికారులు అప్రమత్తమయ్యారు. దాని కదలికలపై ని ఘా పెట్టారు. ఇప్పటికే కెమెరాలకు చిక్కడంతో పెద్ద పులి ఇదే ప్రాంతంలో ఉండి ఉంటుందన్న నిర్ధారణ కు వచ్చారు. మానేరు ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ పరీవాహక ప్రాంతంతో పాటు పాల్వంచ వాగు పరీవాహక ప్రాంతంలో తిరుగుతుండవచ్చని భావిస్తున్నారు.

అంబారిపేట ప్రాంతంలో పెద్దపులి తిరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అది సంచరించే అవకాశం ఉంటుంది. అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. పెద్దపులి సంచారం గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. దాని కదలికలను గమనిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నాం.

– నిఖిత, జిల్లా అటవీ అధికారి, కామారెడ్డి

మైదాన ప్రాంతంలో సంచారం

లేగదూడలపై దాడితో వెలుగులోకి..

పాదముద్రలను పరిశీలించి కెమెరా ట్రాప్స్‌ ఏర్పాటు

కెమెరాలో రికార్డయిన పెద్దపులి

సంచరిస్తున్న దృశ్యాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement