పల్లె పాలనకు 61 ఏళ్లు | - | Sakshi
Sakshi News home page

పల్లె పాలనకు 61 ఏళ్లు

Dec 3 2025 7:19 PM | Updated on Dec 3 2025 7:19 PM

పల్లె పాలనకు 61 ఏళ్లు

పల్లె పాలనకు 61 ఏళ్లు

పల్లె పాలనకు 61 ఏళ్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో

1964లో తొలిసారి పంచాయతీ ఎలక్షన్లు

మొదట్లో పరోక్ష పద్ధతిలో సర్పంచ్‌ ఎన్నిక

డిచ్‌పల్లి: పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఏర్పడి 61 ఏళ్లు పూర్తవుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల ఏర్పాటులో కాలానుగుణంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. 1957లో భారత ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ సంస్థల ఏర్పాటు కోసం బల్వంతరాయ్‌ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మూడంచెల (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చేసిన సూచించగా, జాతీయాభివృద్ధి సంస్థ 1958లో ఆమోదించింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీ రాజ్‌ సంస్థల చట్టం ఏర్పాటు చేసింది. దీన్ని మొట్టమొదటగా రాజస్థాన్‌ రాష్ట్రం అమలు చేయగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 1959 అక్టోబర్‌ 2న అమలు చేసింది.

వార్డు సభ్యులే సర్పంచ్‌ను ఎన్నుకునేలా..

ఆంధ్రప్రదేశ్‌లో 1964లో సమగ్ర గ్రామ పంచాయతీల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం 500 పైగా జనాభా ఉన్న గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభా ఆధారంగా 5 నుంచి 17 మంది వరకు వార్డు సభ్యులుండవచ్చని పేర్కొన్నారు. 1964లో సర్పంచ్‌ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటే, ఈ వార్డు సభ్యులు సర్పంచ్‌ను ఎన్నుకునేవారు. ఎన్నికై న సర్పంచ్‌లు కలిసి సమితి ప్రెసిడెంట్‌ ను ఎన్నుకునేవారు. సమితి ప్రెసిడెంట్‌లు జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేవారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. వీరి ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండేది.

1978 నుంచి ప్రత్యక్ష పద్ధతి..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని ఈ కమిటీ సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్‌ ఎన్నిక ప్రక్రియ ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. 1992లో అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్‌ కులాలు, తెగల వారికి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే 1/3వ వంతు మహిళలకు రిజర్వు చేయాలని సూచించింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ లలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

మండల వ్యవస్థతో మార్పులు..

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థ ఏర్పాటు చేశారు. మండలాలకు 1987లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్‌ అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకున్నారు. దీనిలో సభ్యులుగా ఆయా మండలాల పరిధిలోని సర్పంచ్‌లు ఉండే వారు. ఎంపీపీలు జిల్లా పరిషత్‌ చైర్మన్‌లను ఎన్నుకునేవారు. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994 ద్వారా అదే సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ అనే మూడంచెల వ్యవస్థ రూపొందుకుంది. మండల పరిషత్‌లో సర్పంచ్‌లను సభ్యులుగా తొలగించి వారి స్థానంలో ఎంపీటీసీలను, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికలో ఎంపీపీలను సభ్యులుగా తొలగించి జెడ్పీటీసీలను సభ్యులుగా చేర్చారు. మెజార్టీ ఎంపీటీసీలు, ఎంపీపీని, మెజార్టీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవడం ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటి వరకు అదే ప్రక్రియ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement