● తెయూ ప్రయివేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ నిర్ణయం
● ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను ప్రభుత్వం ఇవ్వకపోవడమే కారణం
తెయూ(డిచ్పల్లి)/ఖలీల్వాడి: తెయూ పరిధిలోని ఉమ్మడి జిల్లాలోగల ప్రయివేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను నేటి (సోమవారం) నుంచి బంద్ చేయనున్నారు. ఈమేరకు తెయూ ప్రయివేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ ఇటీవల తెయూ వీసీ, రిజిస్ట్రార్లకు వినతిపత్రాలను సైతం అందజేసింది. ప్రభుత్వం మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పెండింగ్లో పెట్టడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యాల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
భారంగా కాలేజీల నిర్వహణ..
మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాలకు కాలేజీల నిర్వహణ భారంగా మారింది. కనీసం కాలేజీలో పని చేసే అధ్యాపకులు, సిబ్బందికి ప్రతినెల వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. బకాయిలు విడుదల కోసం సెప్టెంబర్ 16 నుంచే కళాశాలల బంద్ పాటించేందుకు ప్రయివేట్ కాలేజీల యాజమాన్య అసోసియేషన్ సిద్దపడింది. కానీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు రాష్ట్ర కమిటీతో సమావేశం నిర్వహించి నిధులు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోవడంతో నవంబర్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక బంద్ పాటించాలని ప్రయివేటు కాలేజీల యాజమాన్య అసోసియేషన్ నిర్ణయించింది. వీటితోపాటు ప్రయివేట్ బీఈడీ, ఎంసీఏ, నర్సింగ్, బీటెక్ కళాశాలల యాజమాన్యాలు కూడా బంద్ పాటించనున్నాయి.
తెయూ పరిధిలోనే గత మూ డు సంవత్సరాలుగా ఫీజు రీ యింబర్స్మెంట్ బకాయిలు సుమారు రూ.350 కోట్లకు పై గా పేరుకుపోయా యి. ప్రభు త్వం దృష్టికి ఎన్ని సార్లు నివేదించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రయివేట్ కళాశాలలు నిరవధిక బంద్ పాటిస్తున్నాం. ప్రభుత్వం నిధులు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుంది. ఇందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలి.
–జైపాల్రెడ్డి, తెయూ ప్రయివేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ అధ్యక్షుడు
నేటి నుంచి డిగ్రీ కాలేజీల బంద్


