
పేదింట్లో చదువుల ‘భాగ్య’ం!
అమ్మ ప్రోత్సాహం ఎక్కువ..
● ఎంబీబీఎస్ సీటు సాధించిన
చాయ్వాలా కూతురు
● ఉన్నత చదువులే లక్ష్యమంటున్న విద్యార్థిని
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వాళ్లది నిరుపేద కుటుంబం. తండ్రి హోటల్లో చాయ్ తయారు చేస్తాడు. తల్లి బట్టలు కుడుతుంది. ముగ్గురు కూతుళ్లు. ఇద్దరిని టెన్త్, ఇంటర్ వరకు చదివించి పెళ్లి చేసేశారు. చిన్న కూతురు ప్రభుత్వ బడిలో పదో తరగతి వరకు చదివి 9.8 జీపీఏ సాధించింది. ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన ఆమె, పట్టుదలతో చదివి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్కు చెందిన మడపతి నాగయ్యస్వామి, శ్రీశైల దంపతుల కూతురైన భాగ్యలక్ష్మి సిర్గాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకొని పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించింది. దీంతో బాసరలోని ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడికి వెళ్లి జాయిన్ అయిన వారం రోజులకే ఆ చదువు తనకొద్దంటూ ఇంటికి వచ్చేసింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అప్పటికే ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుండడంతో కామారెడ్డిలోని సాందీపని కాలేజీలో చేర్పించారు. తండ్రి నాగయ్య స్వామి కామారెడ్డి పట్టణంలోని ఓ హోటల్లో చాయ్ తయారు చేసే పనిలో చేరాడు. తల్లి ఇంటి దగ్గర ఉంటూ కూతురు చదువు చూసుకుంది. బైపీసీ బాగా చదివితే డాక్టర్ అవుతావంటూ ప్రోత్సహించింది. ఇంటర్లో 992 మార్కులు వచ్చాయి. కాలేజీ అధ్యాపకుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారంతో భాగ్యలక్ష్మి నీట్ రాసి 406 మార్కులు సంపాదించింది. దీంతో మొదట నిర్మల్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. రెండో విడత కౌన్సిలింగ్లో ఆదిలాబాద్ రిమ్స్లో సీటు సాధించింది.
మా నాన్న మా కోసం ఎంతో కష్టపడతాడు. అమ్మ రోజూ చదువుకోమంటూ ఎంతగానో ప్రోత్సహించింది. మెడిసిన్ సీటు సాధించాలంటూ నిత్యం గుర్తు చేస్తూ ఎంకరేజ్ చేసింది. సాందీపని కాలేజీ అధ్యాపకుల సహకారంతో మెడిసిన్ సీటు సాధించాను. ఎంబీబీఎస్ చదివిన తర్వాత కచ్చితంగా పీజీ కూడా సాధిస్తా. న్యూరో లేదా కార్డియాలజీ విభాగంలో సీటు సాధించి మంచి డాక్టర్గా ప్రజలకు సేవలందిస్తా. – భాగ్యలక్ష్మి, విద్యార్థిని