
ఖాతాలు తీసినా వెతలు తీరలే..
మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ కార్మికుల వేతనాలను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఎస్ఎఫ్సీ) నిధు ల నుంచి చెల్లించేందుకు అంగీకరించి ప్రభుత్వం అందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రతి పంచాయతీకి టీఎస్బీపాస్ ఖాతాలను తెరిపించినా నిధులు జమ చేయడంలో అలసత్వం చోటు చేసుకుంటుంది. ఫలితంగా సకాలంలో వేతనాలు అందక పంచాయతీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అస్తవ్యస్తంగా పాలన..
ఎస్ఎఫ్సీ ద్వారా జిల్లాలోని పంచాయతీలకు ప్రతి నెలా రూ.10.30 కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం లేదు. దీనికి తోడు ఎస్ఎఫ్సీ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం ఏర్పడటంతో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో మొత్తం 545 పంచాయతీలు ఉండగా, అందులో కార్మికులు 2,198 మంది, కారోబార్లు 522 మంది విధులు నిర్వహిస్తున్నారు. అందరికీ ఒకే రకంగా ప్రతి నెలా రూ.9,500 చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఎస్ఎఫ్సీ నిధుల నుంచి ప్రతి నెలా టీఎస్బీపాస్ ఖాతాలకు రూ.2 కోట్ల 58 లక్షల 40 వేలను జమ చేస్తే పంచాయతీ కార్మికుల వేతనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో మూడు, నాలుగు నెలలకు ఒకసారి వేతనాలకు గ్రాంటును విడుదల చేయగా ప్రస్తుతం గ్రాంటు విడుదల కాకపోవడంతో రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
సర్దుబాటు చేయిస్తున్నాం
ఎస్ఎఫ్సీ నిధులు విడుదలలో జాప్యం ఏర్పడితే వేతనాల చెల్లింపు ఆలస్యం అవుతుంది. పంచాయతీల్లో నిధులు ఉంటే సర్దుబాటు చేయించి కార్మికులకు వేతనాలు ఇస్తున్నాం. కొన్ని పంచాయతీల్లోనే ఆదాయం బాగుంది. చాలా చోట్ల ఆదాయం తక్కువగా ఉంది. – శివకృష్ణ, డీఎల్పీవో, ఆర్మూర్
జీపీ కార్మికుల వేతనాల కోసం
పంచాయతీకో టీఎస్బీపాస్ ఖాతా
ఎస్ఎఫ్సీ నుంచి నిధులు రాకపోవడంతో రెండు నెలలుగా ఆగిన వేతనాలు
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు
పడుతున్న కార్మికులు