
జీజీహెచ్లో నవజాత శిశువు మృత్యువాత
● ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టిన బంధువులు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని శిశువు కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాలు ఇలా.. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామానికి చెందిన అఖిల పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం సాయంత్రం కామారెడ్డి జీజీహెచ్కు వచ్చింది. వైద్యులు అర్ధరాత్రి ఆమెకు ప్రసవం చేశారు. ఆడపిల్ల పుట్టడంతో మహాలక్ష్మి పుట్టిందని కుటుంబ సభ్యులంతా సంబరంలో ఉన్నా ఆ ఆనందం 5 నిమిషాలు కూడా లేకుండా పోయింది. పుట్టిన శిశువులో చలనం లేకపోవడంతో మృత శిశువు జన్మించిందని వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. కాలయాపన చేయకుండా ఆపరేషన్ చేసి ఉంటే శిశువు బ్రతికేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు ఆస్పత్రిలో ఆందోళన చేశారు. పట్టణ పోలీసులు ఆస్పత్రికి వచ్చి వారిని సముదాయించారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా వైద్యుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదన్నారు. ఉమ్మనీరు మింగడంతోనే శిశువు మృతి చెందిందని తెలిపారు.