
క్రైం కార్నర్
దుబాయ్లో మోపాల్ వాసి మృతి
మోపాల్: మండలకేంద్రానికి చెందిన తలారి సవీన్ (35) దుబాయ్లో మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. సవీన్ ఆగస్ట్ 16న ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. 21న కంపెనీలో పని ముగించుకుని గదిలోకి వచ్చిన సవీన్.. ఫోన్, పర్సు, గుర్తింపు కార్డులు పెట్టి వెళ్లిపోయాడు. ఈనెల 26న రోడ్డు పక్కన చెట్టు కింద విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వా ధీనం చేసుకుని వివరాల కోసం ప్రయత్నించారు. తెలియకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాగా గల్ఫ్ సంఘాలు, గ్రామస్తులు సవీన్ తప్పిపోయాడని వీడియో రూపొందించి వైరల్ చేశారు. ఆ వీడియోను పరిశీలించిన పోలీసులు.. వివరాలు సేకరించి కంపెనీకి సమాచారమిచ్చారు. సవీన్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గల్ఫ్ సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. త్వరగా మృతదేహాన్ని రప్పించే ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మృతుడి తండ్రి తలారి చిన్న లక్ష్మణ్ సైతం దుబాయ్లో ఉన్నాడు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య కృష్ణవేణి కోరుతున్నారు.
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన కారు
బోధన్రూరల్: సాలూర మండలకేంద్రంలోని శివారులో శుక్రవారం ఓ కారు అతివేగం కారణంగా అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు, ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమయ్యాయి. కారులోని ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపారు.

క్రైం కార్నర్