చికిత్స పొందుతూ ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ ఒకరి మృతి

Jul 22 2025 8:59 AM | Updated on Jul 22 2025 8:59 AM

చికిత

చికిత్స పొందుతూ ఒకరి మృతి

భిక్కనూరు: మండల కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాజవేణి రాజేందర్‌(53) సోమవారం వేకువజామున మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాజేందర్‌ను కుటుంబీకులు మొదట కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయంత్రం భిక్కనూరులో అంత్యక్రియలు నిర్వహించారు.

యువకుడి అదృశ్యం

నవీపేట: మండలంలోని పాల్ద గ్రామానికి చెందిన చిన్నోళ్ల గణేశ్‌(35) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై వినయ్‌ సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గణేశ్‌ బతుకుదెరువు నిమిత్తం దుబాయికి వెళ్లగా గత నెలలో అతని తండ్రి మృతి చెందడంతో స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 4న తాను గల్ఫ్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. 15 రోజుల నుంచి ఎలాంటి ఫోన్‌ లేకపోవడంతో భార్య స్రవంతి జిల్లా కేంద్రంలోని ట్రావెల్స్‌ యజమానులను సంప్రదించింది. వారు సౌదీకి వెళ్లలేదని తెలుపడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ

లింగంపేట: మండలంలోని పోతాయిపల్లి శివారులో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పెద్దమ్మతల్లి మెడల ఉన్న మూడు బంగారు పుస్తెలు, హుండీలోని నగదును దుండగులు అపహరించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చోరీ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

వే బిల్లు లేని సరుకు రవాణా ట్రక్కు పట్టివేత

డిచ్‌పల్లి: వే బిల్లు లేకుండా సరుకు రవాణా చేస్తున్న ట్రక్కును నిజామాబాద్‌ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టుకుని డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. ఏసీటీవో కరుణాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు కామారెడ్డి నుంచి ఆదిలాబాద్‌ వైపు వెళ్తున్న ట్రక్కును డిచ్‌పల్లి మండలం బీబీపూర్‌ శివారు జాతీయ రహదారిపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మూడు రోజుల క్రితం పట్టుకున్నారు. డ్రైవర్‌ వద్ద వే బిల్లు లేకపోవడంతో ట్రక్కుతో పాటు అతడిని డిచ్‌పల్లి పీఎస్‌కు తీసుకెళ్లి వారి కస్టడీలో ఉంచారు. సోమవారం వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర కమిషనర్‌ ఆదేశాల మేరకు డిచ్‌పల్లి పీఎస్‌లో తమ సిబ్బందితో చేరుకున్న ఏసీటీవో ట్రక్కు సీల్‌ను తెరిచి అందులో రవాణా చేస్తున్న సరుకును తనిఖీ చేయగా రాజ్‌ నివాస్‌ పాన్‌ మసాల ప్యాకెట్లు బయటపడ్డాయి. సుమారు 200 బస్తాల్లో ఉన్న పాన్‌ మసాల ప్యాకెట్ల విలువను లెక్కించి వాటికి ఎంత మేరకు జీఎస్టీ అవుతుందో నిర్ధారిస్తామన్నారు. అనంతరం జీఎస్టీ ఎగవేయడానికి వే బిల్లు లేకుండా సరుకు అక్రమ రవాణా చేస్తున్నందున జరిమానాగా సుమారు 200 శాతం జీఎస్టీ వసూలు చేస్తామని తెలిపారు. డబ్బులు చెల్లించేంత వరకు సరుకుతో పాటు ట్రక్కు డిచ్‌పల్లి పోలీసుల కస్టడీలోనే ఉంటుందన్నారు. డ్రైవర్‌ను ప్రశ్నించగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్నట్లు చెప్పాడని ఏసీటీవో పేర్కొన్నాడు. అయితే ఇండోర్‌ నుంచి నాగ్‌పూర్‌ మీదుగా నేరుగా ఆదిలాబాద్‌కు చేరుకునే అవకాశం ఉండగా హైదరాబాద్‌ మీదుగా ట్రక్కును ఆదిలాబాద్‌ కు తరలించడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చికిత్స పొందుతూ ఒకరి మృతి
1
1/2

చికిత్స పొందుతూ ఒకరి మృతి

చికిత్స పొందుతూ ఒకరి మృతి
2
2/2

చికిత్స పొందుతూ ఒకరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement