జిల్లాకు చుక్క నీరైనా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

జిల్లాకు చుక్క నీరైనా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

Published Wed, Jun 21 2023 12:54 AM

మాట్లాడుతున్న అన్వేష్‌రెడ్డి.. పక్కన ముప్పగంగారెడ్డి, ఆదిరెడ్డి, తాహెర్‌బిన్‌హందాన్‌ - Sakshi

ఖలీల్‌వాడి: తొమ్మిది ఏళ్లలో సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు చుక్కనీరు అందించలేదని రాష్ట్ర కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు ఆన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో మంగళవారం జిల్లా కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కిసాన్‌ కాంగ్రెస్‌ సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్‌ కాంగ్రెస్‌ కమిటీ, మండల అధ్యక్షులను ప్రకటిస్తూ నియామక పత్రాలు అందించారు. అనంతరం అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాకు సాగు నీరు అందించడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు.

21 ప్యాకేజీ ద్వారా గ్రావిటీ ద్వారా సాగు నీరు అందించే అవకాశం ఉన్నా, కమీషన్ల కోసం పైపు లైన్‌ ఏర్పాటు చేసి, ఇంత వరకు సాగునీరు అందించలేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం నిర్మించామన్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో సాగునీటిపై రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో తరుగు పేరు మీద దోపిడీ జరిగితే మంత్రి, ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారని, ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇంత వరకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిహారం అందించలేదన్నారు. రైతులకు ఇంతవరకు రుణమాఫీ చేయలేదన్నారు.

ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చేసిన మోసాలను వివరించాలన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే చేసే పనులను రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని తెలిపారు. భూమిలేని ఉపాధి హామీ కూలీలకు రూ.12వేలు ప్రతియేటా అందిస్తామన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్‌, జిల్లా కిసాన్‌ సెల్‌ ఇన్‌ఛార్జి ఆదిరెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement