న్యూస్రీల్
వారసత్వం పుణికిపుచ్చుకో..
7
రేపు ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో మంత్రి జూపల్లి సమీక్ష
నిర్మల్చైన్గేట్/ఆదిలాబాద్టౌన్: ఎల్నినో ప్రభావం, ఉమ్మడి జిల్లాలో వర్షాభావ పరిస్థితుల సన్నద్ధతపై ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉట్నూర్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నా లుగు జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధి కారులు హాజరు కానున్నారు. వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలుకు సంబంధించి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం ఉంటుంది. వ్యవసాయ, ఉద్యానవన, మార్క్ఫెడ్, సాగునీటి శాఖ, మిషన్ భగీరథ, మున్సి పల్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, అటవీ, పౌరసరఫరాలు, వైద్యారోగ్య శాఖ, మహిళ, శిశు సంక్షేమ శాఖల అధికారులు పాల్గొని సన్నద్ధంపై వివరాలు సమర్పించనున్నారు.
లక్ష్మణచాంద: ప్రపంచంలోని అనేక దేశాలు భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను చూసి గౌరవిస్తున్నాయి. విదేశీ యువత భారతీయ శాసీ్త్రయ కళలను నేర్చుకోవడానికి దేశానికి వచ్చి, మన సంప్రదాయిక వస్త్రధారణ, బొట్టు, నిండైన సంస్కృతిని చూసి మంత్రముగ్ధులవుతున్నారు. మన సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. అయితే మన యువత విదేశీ సంస్కృతి మోజులో పడి పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్నారు.
మార్పునకు స్పిక్ మెకే శ్రీకారం..
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యువతలో భారతీయ శాసీ్త్రయ సంగీతం, నృత్యం, సంస్కృతిని ప్రోత్సహించేందుకు 1977లో స్పిక్ మెకే(సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియ న్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమంగ్స్ట్ యూత్) అనే స్వచ్ఛంద సంస్థ చర్యలు చేపట్టింది. రాజకీయ రహిత జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ సంస్థను ఐఐటీ ఢిల్లీ ఎమెరిటస్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ సేథ్ ప్రారంభించారు. కళారంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 2009లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు 500కి పైగా విభాగాలు ఉన్నాయి.
సంస్థ ప్రధాన లక్ష్యాలు..
నేటి విద్యార్థులు దేశ అభివృద్ధికి మూలస్తంభాలు. అయినప్పటికీ మొబైల్ ఫోన్ వ్యసనం, ఇతర ఆకర్షణల వల్ల యువత తప్పుడు మార్గంలో పయనిస్తోంది. దీనిని అరికట్టి యువతను సరైన దారిలో నడిపించడం, భారతీయ కళారూపాలను స్వయంగా అనుభవించేలా చేయడం స్పిక్ మెకే ముఖ్య ఉద్దేశం. యువతను భాగస్వాముల ను చేయడం ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని వారికి అందించాలని సంస్థ భావిస్తోంది.
కళాకారుల నృత్య ప్రదర్శనలు
ప్రముఖ కళాకారులు తమ జీవితా న్ని కళకు అంకితం చేసి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. విద్యార్థులు, యువ త ఈ ప్రదర్శనలను నేరుగా వీక్షించి అనుభూ తి చెందడం ద్వారా భారతదేశ సంపన్న సాంస్కృతిక మూ లాలతో మళ్లీ అనుసంధానమవుతున్నారు.
జిల్లాలో 20 పాఠశాలలు ఎంపిక..
జిల్లాలోని 20 పాఠశాలల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి ప్రముఖ ఒడిస్సీ, కూచిపూడి నృత్య కళాకారులు వచ్చారు. వీరిలో ఆశాకుమారీ (ఒడిస్సీ నృత్య కళాకారిణి), సాత్విక రెడ్డి (కూచిపూడి నృత్య కళాకారిణి) ఉన్నారు.
నాట్యం చేస్తూ అర్థం వివరించారు
ఇటీవల వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కూచిపూడి నృత్య కళాకారిణి సాత్వికారెడ్డి నృత్య ప్రధర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక్కో స్టెప్ వేస్తూ దాని అర్థం కూడా వివరించారు. చాలా బాగా అనిపించింది. నాట్యం నేర్చుకోవాలన్న ఆసక్తి పెరిగింది.
– రాజేశ్వరి, విద్యార్థి, వడ్యాల్
మాకు నేర్పించారు..
జిల్లాలో ఆశాకుమారి, సాత్వికరెడ్డి ఇద్దరు కళాకారిణిలు మన సంస్కృతిలో భాగమైన ఒడిస్పీ, కూచిపూడి, భరత నాట్యం వంటివి ప్రభుత్వ పాఠశాలలో ప్రదర్శన చేయడంతోపాటు ఇష్టం ఉన్న వారికి నేర్పించారు. ముందు ముందు మరింత నేర్చుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. – శ్రావణి, విద్యార్థి, లక్ష్మణచాంద
సంస్కృతిని కాపాడాలి..
నేడు ప్రపంచ దేశాలు మన సంస్కృతిని అవలంబిస్తున్నాయి. యువత మన దేశ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ బాధ్యతగా తీసుకోవాలి. విద్యార్థి దశ నుంచే మన సంస్కృతి సంప్రదాయాలు తెలిపేలా ప్రదర్శనలు ఇస్తున్నాం. ఇక్కడ సంస్కృతి చాలా బాగుంది.
– సాత్వికరెడ్డి, కూచిపూడి కళాకారిణి
ఎంపిక చేసిన పాఠశాలలు..
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సారంగాపూర్, టీఎస్డబ్ల్యూఆర్ పాఠశాల, జామ్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, దిలావార్పూర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నర్సాపూర్(జీ), ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లోకేశ్వరం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బోసి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సోన్, టీజీ గరల్స్ రెసిడెన్షియల్ స్కూల్, లెఫ్ట్ పోచంపాడ్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జులాపూర్, బాలికల ఉన్నత పాఠశాల, జుమ్మెరత్పేట్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వడ్యాల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లక్ష్మణచాంద పీఎంశ్రీ పాఠశాల, కొరిటికల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల.
ది గ్రేట్ విరాసత్–2026..
తెలంగాణ విభాగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జనవరి నెలలో ‘ది గ్రేట్ విరాసత్ 2026’ అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది.రాష్ట్రంలోని 500 పాఠశాలల్లో శాసీ్త్రయ సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్నుదేవ్వర్మ ప్రారంభించారు. యువతలో అంతర్గత జ్ఞానం, జిజ్ఞాసను పెంపొందించడం ఈ కార్యక్రమ ధ్యేయం.
మన సంస్కృతి చాలా గొప్పది
మన సంస్కృతి చాలా గొప్పది. ప్రతీ విద్యార్థి, యువత ముందుగా మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలి. అందరిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దానిని గుర్తించండి, సాధన చేయండి, మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. కళ అనేది కేవలం నృత్యం లేదా సంగీతం మాత్రమే కాదు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, గౌరవం, మన సంస్కృతిలో భాగమే. – ఆశాకుమారి, ఒడిస్సీ కళాకారిణి


