లక్ష్మణచాంద: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట చేసే కార్మికులకు శుభవార్త చెప్పింది. 2026–27 విద్యా సంవత్సరం కోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట కార్మికులకు నాలుగు నెలల గౌరవ వేతనాలను ముందుగానే విడుదల చేసింది.
గతంలోని జాప్యాలు..
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట చేసే కార్మికులకు బిల్లుల చెల్లింపు, గౌరవ వేతనాల చెల్లింపులో జాప్యం జరిగేది. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం బిల్లుల నమోదు, చెల్లింపులకు ఆన్లైన్ విధానాన్ని అమలు చేసింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో మొత్తం 830 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యి. వీటిలో 577 ప్రాథమిక పాఠశాలల్లో 23,398 మంది, 89 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,373 మంది, 165 ఉన్నత పాఠశాలల్లో 37,019 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 66,790 మంది విద్యార్థులు ఉండగా, జిల్లాలోని 830 ప్రభుత్వ పాఠశాలల్లో 748 వంట ఏజెన్సీలు పని చేస్తున్నాయి. వీటిలో 1,305 మంది వంట కార్మికులు ఉన్నారు. ప్రభుత్వం వీరికి నెలకు రూ.2 వేల గౌరవ వేతనం అందజేస్తోంది.
కార్మికుల సంతోషం
2026–27 విద్యా సంవత్సరం కోసం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల గౌరవ వేతనాల కోసం జిల్లాకు రూ.1,73,66,000 విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా వంట కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంగా ఉంది..
గతంలో మధ్యాహ్న భోజనం తయారు చేసే మాకు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతోపాటు, గౌరవ వేతనం కోసం వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఈసారి ప్రభుత్వం ముందుగానే మాకు నాలుగు నెలల గౌరవ వేతనాలు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– మేకల రాధిక, వంట కార్మికురాలు, మాచాపూర్


