● విద్యార్థులకు మరింత మెరుగైన విద్య
ఆధునిక సౌకర్యాలు..
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయిలో విద్య ఉంటుంది. ఆధునిక సౌకర్యాలు, అన్ని రకాల వసతులు ఉంటాయి. నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన చేస్తారు. గ్రామీణ విద్యార్థులకు ఇది ఒక వరం. – భోజన్న, డీఈవో
ముధోల్: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్) ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి తెలంగా ణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మూడు పాఠశాలలను టీపీఎస్కు ఎంపిక చేశారు. మంచి విస్తీర్ణం, విద్యార్థులు సంఖ్య అధికంగా ఉండి భవనాలు, సరిపడా ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్లను ఎంపిక చేశారు.
విద్యార్థులకు మంచి అవకాశం
ముధోల్ నియోజకవర్గం నుంచి కుంటాల మోడల్ స్కూల్, నిర్మల్ నియోజవర్గం నుంచి నర్సాపూర్(జి) ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఖనాపూర్ జెడ్పీహెచ్ఎస్ను టీపీఎస్కు ఎంపిక చేశారు. కార్పొరేట్ స్థాయిలో ఉండడంతోపాటు ఎల్కేజీ, యూకేజీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఇంటర్ తరగతులు ఉంటాయి. అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తారు. విద్యార్థులకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని చోట్ల తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు నిర్మిస్తున్నారు. ఇందులో డిజిటల్ బోధన ఇంగ్లిష్ మీడియం, నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా ఉంటాయి.
ఒక్కో పాఠశాలకు రూ.38 కోట్లు..
ఒక్కో టీపీఎస్కు రూ.38 కోట్ల అంచన వ్యయంతో భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో 40 వేల లీటర్ల సంప్, డైనింగ్ హాల్, మూడు అంతస్తులతో స్కూల్ బిల్డింగ్, ప్లే గ్రౌండ్, ఫర్నిచర్, ల్యాబ్, ఇండోర్ స్పోర్ట్స్, ప్రొవైడింగ్ అప్రోచ్ రోడ్, ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ తదితర నిర్మాణాలు చేపడతారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.


