ఇంద్రవెల్లి: ఏజెన్సీ రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. న్యాయమైన హక్కులను పరిష్కరించాలనే డిమాండ్తో అమరవీరుల ఆశయ సాధన సమితి ఆధ్వర్వలో బుధవారం మండలంలోని గిన్నెర గ్రామపంచాయతీ ఆదివాసీలతో రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ నాయకులు మాట్లాడారు. ఏజెన్సీలో పెసా, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని, ఎస్టీ జాబితా నుంచి వలస లంబాడాలను తొలగించాలని పేర్కొన్నారు. రిలే దీక్షలు ఏప్రిల్ 20 వరకు నిర్వహిస్తామన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్, రాష్ట్ర నాయకుడు పుర్క బాపురావ్, జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావ్, అమరవీరుల ఆశయ సాధన సమితి మండల అధ్యక్షుడు మెస్రం నాగ్నాథ్, ఆదివాసీ నాయకులు ఆర్క ఖమ్ము, తుకారం, పుర్క చిత్రు, జుగ్నాక్ భరత్, సోయం రాందాస్, గేడం భారత్ ఉన్నారు.


