
గోడు చెప్పుకున్నా.. గోస తీరడం లేదు!
● ప్రజావాణి అర్జీల పరిష్కారం జాప్యం ● కలెక్టరేట్ చుట్టూ బాధితుల ప్రదక్షిణ ● సమస్యలు పరిష్కారం కావడం లేదని అసంతృప్తి.. ● అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్చైన్గేట్: సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కన్నీటితో వేడుకున్నా.. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్నుఆ్నరు. నాలుగు నెలల నుంచి వేతనాలు లేక అవస్థలు పడుతున్నామని పార్ట్ టైం సిబ్బంది, వితంతు, దివ్యాంగ పింఛన్ రావడం లేదని, కాల్వ కింద భూమి పోతే నష్టపరిహారం రాకుండా అడ్డుకున్నారని ఇలా పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో పలువురు వినతులు సమర్పించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశొర్ కుమార్ అర్జీలు స్వీరించారు. వివిధ సమస్యలపై 73 అర్జీలు వచ్చాయి. సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం అన్ని మండలాల సంబంధిత తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఏవో సూర్యారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క శాఖ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శానిటేషన్ను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. స్కూళ్లు, హాస్టళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎరువులు, విత్తనాల సరఫరాలో ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష చేసి, పనులు వేగవంతం చేఆయాలని ఆదేశించారు.
గోవధశాల తరలించాలి
మేము ఖానాపూర్ పట్టణంలోని శ్రీసాయినగర్, శ్రీరాంనగర్ కాలనీవాసులం. మా కాలనీలో ఉన్న గోవధశాల వలన ఇబ్బంది పడుతున్నాం. వీటి నుంచి వచ్చే వ్యర్థాలను కుక్కలు, పందులు లాక్కొని ఇళ్ల ముందు వేస్తున్నాయి. దుర్వాసన వస్తోంది. అనారోగ్యంపాలవుతున్నాం. గతంలో కూడా అనేకసార్లు అధికారులకు విన్నవించాం. వధశాలను పట్టణ శివారుకు తరలించాలి.
– సాయి నగర్, శ్రీరాంనగర్ కాలనీ వాసులు

గోడు చెప్పుకున్నా.. గోస తీరడం లేదు!